చాలా మందికి నోరూరించే చేపల కూర అంటే చాలా ఇష్టం.వాటి ధర కూడా మార్కెట్లో ప్రస్తుతం భారీగానే పలుకుతోంది.
ఇక ఒక్కోసారి పొలాల్లోకి చేపలు వస్తున్న ఘటనలు విని ఉంటాం.అంతేకాకుండా వర్షం పడినప్పుడు ఆకాశం నుంచి కూడా చేపలు పడ్డాయని వార్తల్లో చూసి ఉంటాం.
అయితే చేపలను ఇష్టపడే వారికి ఇటీవల పంట పండింది.చేతిలో బకెట్లను పట్టుకుని వచ్చి, చేతికందినన్ని చేపలను వారు తీసుకు పోయారు.
ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బీహార్ రాష్ట్రంలోని సహస్ర జిల్లాలో ప్రధాన రోడ్లు కూడా గోతులతో దర్శనమిస్తున్నాయి.
ఆ రోడ్లలో ప్రయాణించాలంటేనే చాలా మంది భయపడిపోతున్నారు.ద్విచక్ర వాహనాలకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి.
ఇక భారీ వాహనాలైతే చెప్పనవసరం లేదు.గుంతల్లో వర్షపు నీరు నిండి పోయి ఉండడంతో చేపల లోడుతో కూడిన ఓ లారీ ఇటీవల బోల్తా పడింది.
దానిలోని చేపలన్నీ రోడ్డు పాలయ్యాయి.ఈ విషయం క్షణాల్లో పాకిపోయింది.
దీంతో చాలా మంది అక్కడకు బకెట్లతో పరుగుపరుగున వచ్చారు.చేతికందిన చేపలను బకెట్లలో నిండుగా నింపుకున్నారు.
తర్వాత వాటిని తీసుకుని ఎంచక్కా ఇంటికి పోయారు.
కొందరైతే తమ దగ్గర ఉన్న సంచులలోనూ, ఇంకొందరు ఏమీ లేకపోవడంతో తాము ధరించిన హెల్మెట్లలోనూ చేపలను నింపుకుని ఇంటికి తీసుకుపోయారు.చేపల కోసం చాలా మంది ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో వాహనాలు నిలిచిపోయాయి.భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ రహదారులను అధికారులు, పాలకులు బాగు చేయించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఫలితంగా తరచూ వాహనాలు బోల్తా పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఏపీలోని ప్రకాశం జిల్లాలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది.అక్కడ బీర్ సీసాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది.
విషయం తెలిసి చాలా మంది అక్కడకు చేరుకున్నారు.చేతికి దొరికినన్ని బీర్లను పట్టుకుని ఇంటికి పోయారు.