కరోనా మహమ్మారి కారణంగా గతేడాది అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించారు నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ సైతం ఈ ఆంక్షలను యథావిధిగా కొనసాగించారు.
అటు కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్పై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది అగ్రరాజ్యం.అయితే ప్రస్తుతం మనదేశంలో కోవిడ్ అదుపులోకి వస్తుండటంతో పలు దేశాలు ఆంక్షలను సడలిస్తూ వస్తున్నాయి.
ఇప్పటికే యూఏఈ, బ్రిటన్లు భారతీయులను తమ దేశం రావడానికి అనుమతిస్తున్నాయి.తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా భారతదేశంపై వున్న ఆంక్షలను సడలించింది.
అలాగే వివిధ దేశాల్లో కరోనా పరిస్థితులు మెరుగుపడినందున కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా దేశాల పౌరులను దేశంలోకి అనుమతించాలని జోబైడెన్ సర్కార్ నిర్ణయించింది.
ఈ మేరకు చైనా, బ్రెజిల్, ఇరాన్, దక్షిణాఫ్రికా, భారత్, యూకే, ఐర్లండ్, ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్తోనియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐస్లాండ్, ఇటలీ, లాత్వియా, లీచ్టెన్స్టీన్, లిథువేనియా, లగ్జెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, నార్వే, పోలండ్, పోర్చుగల్, స్లొవేకియా, స్లొవేనియా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ వంటి 33 దేశాలపై ఆంక్షలను ఎత్తివేసింది.
రెండు డోసుల టీకా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకా అయితే ఒక డోసు.వేయించుకున్నవారు నవంబరు నుంచి అమెరికాలోకి రావొచ్చని అగ్రరాజ్యం ఒక ప్రకటనలో తెలిపింది.అయితే, అమెరికా ప్రయాణానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని, నెగెటివ్ రిపోర్ట్ కలిగి ఉండాలని వెల్లడించింది.వ్యాక్సిన్ వేయించుకుని, కరోనా నెగిటివ్ రిపోర్ట్ వున్న వారు అమెరికాలో క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు.
అయితే భారత్, చైనాల విషయంలో చిన్న గందరగోళం నెలకొంది.మన దేశంలో భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్కు.చైనాలో అభివృద్ధి చేసిన టీకాలకు అమెరికా సీడీసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులు లేవు.దీంతో ఈ రెండు దేశాల్లో టీకాలు వేయించుకున్నవారిని అనుమతించాలా వద్దా అనే విషయంపై అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
కాకపోతే నవంబర్ వరకు సమయం వుండటంతో దౌత్య పరమైన చర్చల ద్వారా సమస్య పరిష్కారమయ్యే అవకాశం వుందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.