ప్రస్తుతం భూగోళాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం నుంచి ప్రపంచం కోలుకోవాలంటే రెండు, మూడేళ్లు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆ రంగం… ఈ రంగం అని లేకుండా అన్ని రంగాలు కూడా కరోనాకు ముందు కరోనాకు తర్వాత అన్నట్లుగా పరిస్ధితి మారుతుందని చెబుతున్నారు.
భారత్లో విద్యను అభ్యసించడానికి వచ్చే ఎన్ఆర్ఐలు, విదేశీయులపై కోవిడ్ 19 ప్రభావం స్పష్టంగా కనిపించనుంది.ఇప్పటికే దీని తాలుకా పరిణామాలు కనిపిస్తున్నాయి.పంజాబ్లోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లోని 47 ఎన్ఆర్ఐ కోటా ఎండీ, ఎండీఎస్ సీట్లకు గాను కేవలం 7 దరఖాస్తులు మాత్రమే రావడం పరిస్ధితికి అద్దం పడుతోంది.దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి.
కరోనా కారణంగా ఇతర దేశాలకు వెళ్లేందుకు భయపడటం ఒకటైతే, విదేశీయులు, ఎన్ఆర్ఐల రాకపై ఆంక్షలు మరో కారణం.
మరోవైపు కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించింది.ఎన్నారై కోటా కింద అభ్యర్ధుల తాత్కాలిక మెరిట్ జాబితాలో ఏడుగురు అభ్యర్ధులు మాత్రమే ఉన్నారు.కాగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఎన్ఆర్ఐ ఎండీ/ఎంఎస్ (క్లినికల్) కోర్సు ఫీజు 1.25 లక్షల డాలర్లు, అదే ఎండీఎస్ కోర్సు కోసం లక్ష డాలర్లను ఫీజుగా నిర్ణయించారు.పంజాబ్ ప్రభుత్వం ఎన్ఆర్ఐ విద్యార్ధుల కోసం రాష్ట్రంలోని మెడికల్, డెంటల్ కాలేజీల్లో 36 ఎండీ/ఎంఎస్ సీట్లు, 11 ఎండీఎస్ సీట్లు కేటాయించింది.
ఈ కళాశాలలకు ఆదాయం సమకూరేందుకు 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించింది.అయితే ప్రస్తుత పరిస్ధితిని బట్టి చూస్తే ఈ సీట్లు చాలా వరకు మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.