నల్లగొండ జిల్లా:దేశంలోని మిగతా ముఖ్యమంత్రులు పాలన చేసే పనిలో ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భూములను మింగే పనిలో బిజీగా ఉన్నాడని,అందుకే రెవిన్యూ వ్యవస్థకి కేసీఆర్ బద్దశత్రువుగా మారాడని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.
ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని బీఎస్పీ బహిరంగ సభకు హాజరైన ఆయన తహశీల్దార్ కార్యాలయం వద్ద గత 55 రోజులుగా వీఆర్ఏలు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ న్యాయబద్దమైనా డిమాండ్లను నెరవేర్చాలని వారం రోజుల క్రితం ఇందిరా పార్క్ నుండి అసెంబ్లీ వద్దకు వెళుతుంటే పోలీసులతో వారిపైన పశువుల కంటే హీనంగా లాఠీ ఛార్జ్ చేయడం దుర్మార్గం అన్నారు.2002 లో విద్యుత్ పోరాటం చేస్తున్న పేద ప్రజలపై కాల్పులు జరిపి నలుగురి మరణానికి కారణమైన నాటి సీఎం చంద్రబాబుకు ప్రజలు ఏ విధమైన గతి పట్టించారో చూశామన్నారు.ఇప్పుడు వీఆర్ఏలను పొట్టన పెట్టుకున్న కేసీఆర్ కి కూడా రానున్న రోజుల్లో అదే గతి పట్టనుందన్నారు.ఫిబ్రవరి 15 నుండి వీఆర్ఏలకు శుభవార్తన్న ముఖ్యమంత్రి వాళ్ళ సమస్యల పరిష్కారం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో వాటానో, సంపాదించిన అవినీతి సోమ్మునో అడగలేదని, న్యాయంగా రావాల్సిన పే స్కెల్స్,వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలని అడుగుతున్నారని తెలిపారు.కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణ రెవిన్యూ వ్యవస్థను అత్యంత అవినీతి శాఖగా చిత్రీకరిస్తున్నారని వాపోయారు.
వీఆర్ఏ,వీఆర్వో వ్యవస్థను తీసేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములని మింగే పనిలో కేసీఆర్ ఉన్నారన్నారు.ఈ టీఆర్ఎస్,కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఏవి కూడా మీకు న్యాయం చేయలేవని,బీఎస్పీ వీఆర్ఏలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.