దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చిక్కుముడులు వీడటం లేదు.దీనికి కారణం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డేనని సీబీఐ అధికారులు, వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆరోపిస్తున్నారు.
వైఎస్ వివేకా హత్య ప్రణాళిక నుంచి ఆధారాలను ధ్వంసం చేయడం వరకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డే కీలక పాత్ర పోషించాడని వైఎస్ సునీత తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు.
వివేకా హత్య కేసులో A5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని సునీత తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టును కోరారు.
కడప జైలులో ఉన్న శివశంకర్ సాక్షులను బెదిరిస్తున్నాడని, కేసు విచారణ ముగిసే వరకు బెయిల్ మంజూరు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.మే 26న తాత్కాలిక బెయిల్ మీద శివశంకర్రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఆయన ఫొటోలతో పులివెందుల మొత్తం భారీ ఫ్లెక్సీలతో నిండిపోయిందని కోర్టుకు వివరించారు.
ఆ సమయంలో రాజకీయ నాయకులతోపాటు ఒక ఇన్స్పెక్టర్ కూడా ఆయన్ను కలిశారని గుర్తుచేశారు.
వివేకా హత్య జరిగినరోజు పనిమనిషిని పిలిపించి నేలపై మంచంపై పడ్డ రక్తాన్ని శుభ్రం చేయించడంతోపాటు శరీరంపై గాయాలు కనపడకుండా కాంపౌండర్ను పిలిపించి కుట్లు వేయించింది దేవిరెడ్డేనని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి.

అటు ఫిజియో థెరపీ చేయించుకోవాలనే పేరుతో అప్పుడప్పుడు బయటకు వస్తూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సునీత తరఫు లాయర్ కోర్టుకు వివరించారు.
తాజా పరిణామాలతో వైఎస్ వివేకా హత్య కేసులో దేవినేని శివశంకర్రెడ్డి ప్రధాన నిందితుడు అని స్పష్టమవుతోంది.అయితే ఈ హత్య కేసులో శివశంకర్రెడ్డి ప్రమేయం ఉందని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు.ఈ కేసులో అప్రూవర్గా మారిన మరో నిందితుడు షేక్ దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా అతడిని అరెస్టు చేశారని కోర్టుకు నివేదించారు.తాజా పరిణామాల నేపథ్యంలో చివరకు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.