మైక్రోసాఫ్ట్ సీఈవో, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల పద్మభూషణ్ పురస్కారం స్వీకరించారు.ఈ ఏడాది జనవరిలో ఆయనకు భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ అత్యున్నత పురస్కారాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ నుంచి సత్యనాదెళ్ల అందుకున్నారు.ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.
ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డ్ తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని… ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, భారత ప్రజలకు సత్యనాదెళ్ల కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం కాన్సుల్ జనరల్ నాగేంద్ర ప్రసాద్తో ఆయన భేటీ అయ్యారు.
మరోవైపు సత్యనాదెళ్ల వచ్చే ఏడాది జనవరిలో భారతదేశంలో పర్యటిస్తారని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
సత్యనాదెళ్ల ప్రస్థానం:
సత్య నాదెళ్ల స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కాపురం గ్రామం.ఆయన తండ్రి నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి.2004 నుంచి 2009 వరకు కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యునిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు.సత్య విద్యాభ్యాసమంతా హైదరాబాద్లోనే సాగింది.
మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీఈ పూర్తి చేసిన ఆయన అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు.
సన్ మైక్రోసిస్టమ్లోని టెక్ బృందంలో పనిచేసిన సత్యనాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్లో చేరారు.కీలక విభాగాలైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, క్లయింట్ సర్వీసెస్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విండోస్ సర్వీర్, డెవలపర్ టూల్స్ వంటి రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
2014లో సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మైక్రోసాఫ్ట్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.కొత్తతరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు.క్లౌడ్ కంప్యూటింగ్తో పాటు మొబైల్ రంగంపైనే ఆయన ఎక్కువ దృష్టి పెట్టారు.న్యూయాన్స్ కమ్యూనికేషన్స్, లింక్డ్ఇన్, జెనిమాక్స్ లాంటి బిలియన్ డాలర్ల కొనుగోళ్లతో పాటు అనేక డీల్స్తో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో సత్యనాదెళ్ల కీలక పాత్ర పోషించారు.