న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జేసిండా ఆర్డెర్న్ సోమవారం తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్ధీకరించారు.ఈ క్రమంలో భారత సంతతికి చెందిన మంత్రి ప్రియాంకా రాధాకృష్ణన్ ప్రమోషన్ కొట్టేశారు.
ఆమెకు కేబినెట్ ర్యాంక్ ఇస్తూ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు.నవంబర్ 2020 నుంచి మంత్రిగా వున్న ప్రియాంక పలు శాఖలను నిర్వహిస్తున్నారు.
అక్టోబర్ 17న జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.ఆక్లాండ్లోని మౌంగాకీకీకి చెందిన ప్రియాంకా సైతం ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.
దీంతో ఆమెకు తన కేబినెట్లో స్థానం కల్పించారు జేసిండా.తద్వారా న్యూజిలాండ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా ప్రియాంక చరిత్ర సృష్టించారు.
డైవర్సిటీ, ఇన్క్లూజన్, ఎథినిక్ కమ్యూనిటీ శాఖ మంత్రిగా, సామాజిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన సహాయ మంత్రిగా బాధ్యతలను ప్రియాంకకు అప్పగించారు.
ప్రియాంక రాధాకృష్ణన్ తండ్రి ఆర్.రాధాకృష్ణన్ స్వస్థలం కేరళలోని ఎర్నాకులం.సింగ్పూర్లో విద్యాభ్యాసం పూర్తిచేసి ఉన్నత విద్య కోసం న్యూజిలాండ్ వెళ్లిన ప్రియాంక అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు.గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు, వలస కార్మికుల సమస్యలపై ఆమె నినదించారు.2006లో లేబర్ పార్టీలో చేరిన ప్రియాంక.2017లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్కు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా పార్లమెంట్లో తన మాతృభాష మలయాళంలోనే ప్రసగించి అందరినీ ఆకట్టుకున్నారు.
న్యూజిలాండ్ పౌరుడు రిచర్డ్సన్ను వివాహం చేసుకున్నారు.ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆయన సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా వుండేవారు.
ఈ క్రమంలో గృహ హింస బాధితుల తరఫున పోరాడే ఓ ఎన్జీవోలో వాలంటీర్గా వున్న ప్రియాంకతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది.