నల్లగొండ జిల్లా: ఒకవైపు రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని జగదీశ్ రెడ్డి చెబుతుంటే…మరోవైపు సీఎండీ ప్రభాకర్ రావు 24 గంటలు సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నామని అంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.తన శాఖలో ఏం జరుగుతుందో జగదీష్ రెడ్డికి తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు.
జగదీశ్ రెడ్డిని మంత్రివా? లేక ఆ శాఖలో పని చేసే బంట్రోతువా అంటూ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.అసలు ఎప్పుడైనా ఉచిత విద్యుత్పై సమీక్ష చేశారా అంటూ మండిపడ్డారు.
ఆర్టీజన్లను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి,ఇప్పుడు వారిని మోసం చేశారని ఆరోపించారు.కాంగ్రెస్ హయాంలో ప్రతి నెల 1వ తేదీనే విద్యుత్ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడేవని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
అలాంటిది బీఆర్ఎస్ పాలనలో 20వ తేదీ వచ్చినా ఇంకా వారి ఖాతాల్లో జీతాలు పడటం లేదని ఆరోపించారు.ఇంతలా జీతాలు ఇవ్వలేని స్థితికి విద్యుత్ శాఖ దిగజారిందని ధ్వజమెత్తారు.
ఇప్పటికైనా విద్యుత్ ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వాలని కోరారు.ఇందుకు సిగ్గుతో జగదీష్ రెడ్డి తలవంచుకొని మంత్రి పదవికి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
వెంటనే రాజీనామా చేసి విద్యుత్ ఉద్యోగులకు, తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలని సూచించారు.రాష్ట్రంలో చేతకాని, సోయిలేని మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగదీష్ రెడ్డి మాత్రమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.