అమ్మతనం, భావోద్వేగాలు మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంటాయని పలు సందర్భాల్లో మనం చూసే ఉంటాం.సోషల్ మీడియా విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత వివిధ వీడియోలు మనకు ఫోన్లలో కనిపిస్తున్నాయి.
వాటిలో కొన్ని కవ్విస్తుంటాయి.మరికొన్ని నవ్విస్తుంటాయి.
ఇంకొన్ని కన్నీరు పెట్టిస్తుంటాయి.తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో చూసిన వారందరినీ కన్నీరు పెట్టిస్తోంది.
పశ్చిమ బెంగాల్కు సంబంధించి ఓ ఏనుగుల గుంపునకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.బనార్హాట్ బ్లాక్లోని డోర్స్ ప్రాంతంలోని చునాభతి టీ తోటలో ఆ వీడియోను తీశారు.
ఆ ప్రాంతంలో ఓ 30 నుంచి 35 వరకు ఉండే ఏనుగుల గుంపు సంచరిస్తోంది.ఆ గుంపులో ఓ ఏనుగు పిల్ల ఏ కారణం వల్లనో మృతి చెందింది.
అయితే చనిపోయిన ఆ గున్న ఏనుగును దాని తల్లి వదిలి పెట్టలేదు.దానిని మోసుకుంటూ ఒక తేయాకు తోట నుంచి మరొక తోటకు కన్నీళ్లతో పరుగులు పెట్టింది.
దాదాపు ఏడు కిలో మీటర్లకు పైగా ప్రయాణించింది.ఈ సన్నివేశాన్ని చూసిన వారందరికీ ఈ ఘటన కన్నీళ్లు పెట్టించింది.
ఇలా చాలా తేయాకు తోటలను దాటుకుని చివరికి రెడ్బ్యాంక్ టీ గార్డెన్లోని పొద దగ్గర పిల్ల ఏనుగు మృతదేహాన్ని విడిచిపెట్టింది.ఎంతో కన్నీళ్లతో మిగిలిన ఏనుగులతో కలిసి బాధగా వెళ్లిపోయింది.
ఈ సన్నివేశాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.దీనిని చూసిన నెటిజన్లు ఆ ఏనుగు తల్లి ప్రేమను కొనియాడుతున్నారు.
జంతువైనా దానికి కూడా తల్లిమనసు ఉంటుంది కదా అని కామెంట్లు పెడుతున్నారు.ఇక ఏనుగుకు కూడా మనిషిలా భావోద్వేగాలు ఉంటాయని పలు సందర్భాల్లో శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
దానిని తాజా ఘటన నిరూపించింది.అటవీ సిబ్బందికి ఈ విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్నారు.
ఏనుగు పిల్ల ఏ కారణంతో చనిపోయిందో అన్వేషిస్తున్నారు.మరోవైపు పెద్ద మొత్తంలో ఏనుగుల గుంపు అక్కడ సంచరిస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.