తొలినాళ్ళల్లో కమ్యూనిస్టులకు, ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న ఖమ్మం జిల్లాను తనకు పెట్టని కోటగా మార్చుకునే క్రమంలో, ఎమ్మెల్సీగా ఉన్న తుమ్మలను పాలేరు బరిలోకి దింపిందన్న విశ్లేషణలు వస్తున్నాయి.అయితే ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్న టీ టీడీపీ కూడా సత్తా చాటేందుకు కాస్తంత లేటుగానే అయినా, సర్వశక్తులు ఒడ్డేందుకు కార్యరంగాన్ని సిద్ధం చేసుకుంటోందని టాక్.
ఖమ్మం మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావును బరిలోకి దించే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
గతంలో తుమ్మల ఎమ్మెల్యేగా ఉండగా, నామా ఎంపీగా ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు.
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమి పాలయ్యారు.అయితే జనంలో మంచి పట్టున్న తుమ్మల ఓటమికి నామా నాగేశ్వరరావు తెరవెనుక యత్నాలు చేశారన్న ఆరోపణలు నాడు గుప్పుమన్నాయి.
దీంతో ఆధిపత్య పోరులో భాగంగానే నాడు నామా… ఖమ్మం అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన తుమ్మలను ఓడించారన్న వాదన ఉంది.అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికలు కావడంతో ఖమ్మం పార్లమెంటు నుంచి బరిలోకి దిగిన నామా, వైసీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో మట్టి కరిచారు.
నాడు ఎన్నికల్లో ఓటమితో అటు నామాతో పాటు ఇటు తుమ్మల కూడా చాలాకాలం పాటు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.అయితే టీఆర్ఎస్ లో చేరిన తుమ్మల క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటున్నారు.
అయితే ఓటమి తర్వాత పూర్తిగా వ్యాపారంలోనే తలమునకలైన నామా… రాజకీయాలకు దాదాపుగా దూరంగానే వ్యవహరిస్తున్నారు.
అయితే తాజాగా పాలేరు బరిలోకి దిగాల్సిందేనని నామాను అనుచరులు కోరుతుండడం మరియు పార్టీ అధిష్ఠానం కూడా కార్యకర్తల వాదనకు విలువిచ్చి నామాను బరిలోకి దింపేందుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే జరిగితే తెలంగాణా గడ్డ మీద రసవత్తరమైన పోరుకు తెరలేపినట్లేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.