జగన్ సర్కార్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల్లో ఇంగ్లిష్ మీడియం కూడా ఒకటి.ఇది మాతృభాషను పూర్తిగా నిర్వీర్యం చేసే నిర్ణయమంటూ ప్రతిపక్షాలు, మేధావులు గళమెత్తారు.
సాక్షాత్తూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా తెలుగును బతికించాలంటూ పార్లమెంట్లో మొరపెట్టుకున్నారు.అయినా ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు.
అయితే ఈ ఇంగ్లిష్ మీడియం నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనదైన స్టైల్లో పోరాటం మొదలుపెట్టారు.ఒకటి, రెండు, మూడో తరగతి చదువుతున్న నిరుపేద విద్యార్థులపై సడెన్గా ఇలా ఇంగ్లిష్ మీడియం రుద్దితే వాళ్లు చాలా ఇబ్బందులు పడతారని పవన్ అంటున్నారు.
ట్యూషన్లు పెట్టించుకునే స్థోమత ఉన్న వాళ్లు ఎలాగోలా గట్టెక్కుతారని, మిగతా వాళ్ల విషయం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఈ నిర్ణయం వల్ల కనీసం 50 శాతం విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడనుందని పవన్ అన్నారు.అందుకే తాను ఇంగ్లిష్ మీడియం నిర్ణయంపై పోరాటం మొదలుపెట్టానని, రాజకీయాలకు అతీతంగా తెలుగు కోసం అందరూ గళం విప్పాలని పిలుపునిచ్చారు.అంత మంది పేద విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుందన్న తన ఆవేదనను అర్థం చేసుకోవాలని పవన్ కోరారు.

ప్రతి వర్గానికీ ఏదో ఒక తాయిలం ప్రకటిస్తూ.పేదలకు బిస్కెట్లు వేయడం మానుకోవాలని అధికార పార్టీకి పవన్ హితవు పలికారు.నిజానికి గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఓ ఏడాది పాటు రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా ఉండాలని అనుకున్నట్లు చెప్పారు.అయితే వైసీపీ సర్కార్ తీరు వల్ల ఆరు నెలల్లోపే మళ్లీ ఫుల్టైమ్ పని చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు.