తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కాలని 12 ఏళ్ల కిందట జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఓ జీవో తీసుకొచ్చారు.దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకున్నారు.
అయితే అప్పుడాయన వద్దనుకున్న జీవోకే మరింత పదును పెడుతూ.ఏపీలో జగన్మోహన్రెడ్డి జీవో 2430ని తీసుకొచ్చారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు రాయకుండా మీడియాపై ఆంక్షలు విధించే జీవో ఇది.నిరాధార ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తే సదరు పత్రిక, టీవీ లేదా వెబ్సైట్లకు సంబంధించిన వాళ్లపై చర్యలు తీసుకునే అధికారం ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు ఇస్తూ ఈ జీవో జారీ చేశారు.దీనిపై ఎంత మంది ఆందోళన వ్యక్తం చేసినా జగన్ వెనుకడుగు వేయలేదు.

అయితే తాజాగా ఆ జీవోను రద్దు చేయాల్సిందిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జగన్ సర్కార్ను ఆదేశించింది.ఈ జీవోను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ప్రెస్ కౌన్సిల్ను ఆశ్రయించింది.ప్రభుత్వం తరఫున వాదన వినిపించడానికి సమాచార, పౌర సంబంధాల శాఖ అదనపు డైరెక్ట్ కిరణ్ ప్రెస్ కౌన్సిల్ ముందు హాజరయ్యారు.
అయితే రెండు వర్గాల వాదన విన్న తర్వాత ఆ జీవోను రద్దు చేయాల్సిందేనని జస్టిస్ ప్రసాద్ స్పష్టం చేశారు.ఇలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, తీవ్ర వ్యతిరేకత వచ్చిన తర్వాత వెనక్కి తగ్గడం జగన్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదు.
గతంలో పీపీఏల రద్దు విషయంలో కేంద్రం సీరియస్ అవడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.ఇక ఏబీఎన్, టీవీ 5 చానెళ్లపై నిషేధం విధించినప్పుడు కూడా.టీడీ శాట్ రంగంలోకి దిగి ఆ నిషేధాన్ని ఎత్తేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.