ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు ఏదైనా చిన్న దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వారే సొంతంగా మెడికల్ షాప్ ల దగ్గరికి వెళ్లి యాంటీబయోటిక్ ఇవ్వండి అని మరీ అడిగి దాన్ని ఉపయోగిస్తున్నారు.అంటే దాదాపు ఈ రోజుల్లో ఎవరికి వారే ఒక పెద్ద డాక్టర్ల లాగా ఫీల్ అయిపోవడం జరుగుతుంది.
దీనివల్లే మన దేశ వ్యాప్తంగా యాంటీ బయోటిక్స్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోతుంది.చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు కూడా యాంటీబయోటిక్స్ ను ఉపయోగిస్తున్న పరిస్థితి ఏర్పడింది.
యాంటీబయోటిక్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారికి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు అవి ప్రభావంతంగా పనిచేయలేకపోతున్నాయని ఐసిఎంఆర్ సంస్థ గుర్తించింది.
అయితే ఈ క్రమంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చ్ యాంటీబయాటిక్స్ వినియోగానికి వ్యతిరేకంగా వైద్యులకు హెచ్చరికలు జారీ చేసింది.
ఎప్పుడు యాంటీబయోటిక్స్ వినియోగించడం వల్ల మానవ శరీరంలో ఉండే వ్యాధికారక క్రిములలో వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని ఐసిఎంఆర్ చెబుతోంది.దీంతో సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడం పెద్ద సవాల్ గా మారిపోతుందని వెల్లడించింది.
రోగులకు యాంటీబయోటిక్స్ ను సూచించేటప్పుడు వైద్యులు కచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.
మనదేశంలో చాలామంది రోగులకు అత్యంత శక్తివంతమైన కార్బపినం యాంటీబయోటిక్ ను ఇచ్చిన ప్రయోజనం ఉండడం లేదని దీనికి బ్యాక్టీరియా త్వరగా లొంగడం లేదని అందుకు కారణం చిన్నచిన్న వ్యాధులకు యాంటీబయోటిక్స్ విపరీతంగా వాడడమే అని తెలిపింది.మొత్తానికి ఐసిఎంఆర్ తాజా సర్వేలో విపరీతంగా యాంటీబయోటిక్స్ ను ఉపయోగించి అరోగ్య సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో అవి ఏమాత్రం ప్రభావం చూపవని కూడా చెప్పింది.ఈ క్రమంలోనే యాంటీబయోటిక్స్ పట్ల డాక్టర్లు ఇటు ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని దీని వినియోగాన్ని తగ్గించాలని పేర్కొంది.