మనలో చాలామందికి పుస్తకాలు చదివే అలవాటు ఉండి ఉంటుంది.ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిన కారణంగా ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ లలో చూసుకుంటూ చదివేస్తున్నారు.
ఇదివరకు కాలంలో ఏదైనా పుస్తకాలు చదవాలంటే వారి ఊరిలో ఉన్న లైబ్రరీకి వెళ్లి అక్కడ ఉన్న పుస్తకాలను ఇంటికి తీసుకు వచ్చి చదువుకునే వారు.ప్రస్తుతం అలాంటి రోజులు పోయి కేవలం మొబైల్ ఫోన్ లోనే కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటూ సమయానికి నడుపుతున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.మనం ఎవరికైనా నలుగురికి మంచి చేస్తే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ నలుగురు తిరిగి సాయం చేస్తారని మనం ఎన్నోసార్లు పెద్దలు చెబుతుంటే వింటూ ఉండి ఉంటారు.
ఇప్పుడు ఈ మాట ఈ పెద్దాయన విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమైంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
ఇసాక్ అనే 63 ఏళ్ల పెద్దాయన తన కష్టార్జితంతో లైబ్రరీని నిర్మించాడు.
గత పది సంవత్సరాల నుంచి ఆయన లైబ్రరీ ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచాడు.ఆ లైబ్రరీలో ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాలను పెడుతూ వివిధ భాషల న్యూస్ పేపర్లను ఉంచేవాడు.
అక్కడ ఉన్న స్థానికులు ఈ లైబ్రరీనీ బాగా వినియోగించుకునేవారు.అయితే కాలం ఎవరు చెప్పినట్లు వినదు కదా.అందుకే ఏమైందో ఏమో తెలియదు గానీ లైబ్రరీకి పెద్దఎత్తున మంటలు అంటుకున్నాయి.ఈ దుర్ఘటనలో లైబ్రరీలోని చాలా పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న అక్కడి స్థానికులు అలాగే పుస్తకప్రియులు ఆ పెద్దాయన కష్టాన్ని గుర్తు చేసుకొని ఆయన కష్టంలో కూడా పాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా చాలా మంది చేయి చేయి వేసి పెద్ద ఎత్తున చందాలు చేకూర్చారు.అది ఎంతలా అంటే కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 20 లక్షల రూపాయలను సేకరించారు.ఈ పెద్దాయన అంటే స్థానికులలో చాలా గౌరవం.
దీనికి కారణం అతడు రోజు కూలీగా జీవనం గడిపే వ్యక్తి అయినా సరే తన డబ్బులను పూర్తిగా లైబ్రరీకి ఖర్చు చేసేవాడు.దీనికి కారణం ఇసాక్ తన చిన్నప్పుడు చదువుకోలేకపోయిన కారణంతో తనలా కాకూడదనే ఉద్దేశంతో ఇలా లైబ్రరీని ఏర్పాటు చేశాడు.
ఈ లైబ్రరీ లో ఏకంగా 11 వేల పుస్తకాలు ఉన్నాయి.ఇక ఇందులో ఏకంగా మూడు వేల వరకు భగవద్గీత పుస్తకాలు ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.వీటితో పాటు స్థానిక భాష అయిన కన్నడ అభివృద్ధి కోసం లైబ్రరీలో కన్నడ భాషకు సంబంధించిన ఎన్నో పుస్తకాలను అతడు ఉంచేవాడు.