ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల జమ్మూకశ్మీర్లోని ఓ ఊరు ఊరంతా కూడా కరోనా కల్లోలానికి గురైంది.జమ్మూ కాశ్మీర్ లోని ఒక గ్రామంలో ఏకంగా 30 మందికి కరోనా పాజిటివ్ రావడం తో ఊరు ఊరంతా కూడా క్వారంటైన్ కు వెళ్లాల్సివచ్చింది.
జమ్మూకాశ్మీర్ లోని మొహల్లా గ్రామం లో ఈ ఘటన చోటుచేసుకుంది.మొహల్లా గ్రామంలో మొత్తం 30 మందికి కరోనా పాజిటివ్ అని తేలడం తో ఆ గ్రామం అతిపెద్ద హాట్ స్పాట్ కేంద్రంగా మారిపోయింది.
కేవలం ఒకే ఊరిలో ఇంత మంది కరోనా సోకడం సంచలనంగా మారింది.మొహల్లా గ్రామాన్ని ఈ మహమ్మారి చుట్టుముట్టడంతో చుట్టుపక్కల గ్రామాల వారు వణికిపోతున్నారు. దీంతో గ్రామం మొత్తాన్ని నిర్బంధం చేశారు.దాదాపు 400 మంది క్వారంటైన్లో ఉంచినట్లు తెలుస్తుంది.మొహల్లా గ్రామాన్ని పారిశుద్ధ్య కార్మికులు శానిటేషన్ చేశారు.దానికి చుట్టు పక్కన ఉన్న నాలుగు గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు.
అయితే ఒక వ్యక్తి వల్లే ఈ వైరస్ సోకినట్టుగా అధికారులు భావిస్తున్నారు.ఇటీవల ఆ గ్రామంలో ఓ వృద్ధుడు అనారోగ్యంతో మరణించగా,అతను మరణించిన తర్వాత వైద్య సిబ్బంది రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.
దీనితో వెంటనే అతని కుటుంబ సభ్యులైన 11 మందికి కరోనా సోకినట్లు తేలింది.
అయితే ఆ వృద్ధుడు అనారోగ్యంతో ఉన్నారని తెలియగానే గ్రామానికి చెందిన పలువురు కలిసి పరామర్శించడం తో వారిలో కూడా కొంతమందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
దీనితో ఆ గ్రామం లో ఉన్న అందరినీ కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలించి ఆ గ్రామాన్ని శానిటేషన్ చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటి వరకు బందీపోరా జిల్లాలో మొత్తం 91 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా,వాటీలో మొహల్లా గ్రామంలోనే అత్యధిక కేసులు ఉన్నట్లు తెలుస్తుంది.