సూర్యాపేట:మంత్రి జగదీష్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో జరిగిన ధాన్యం కొనుగోలు అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో శుక్రవారం స్ప్రెడ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డితో కలిసి విద్యార్థులకు బ్యాగులు అందజేశారు.అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో జరిగిన ధాన్యం కొనుగోళ్లలో దాదాపు రూ.100 కోట్ల అక్రమాలు జరిగాయని,తూతూ మంత్రంగా విచారణ జరిపి దోషులను తప్పిస్తున్నారని మండిపడ్డారు.జిల్లా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే కొనుగోలులో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.యాసంగిలో ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ,టీఆర్ఎస్ పార్టీల నేతలు డ్రామాలు ఆడుతూ రైతులను ఆగం చేశారని గర్తుచేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ ఏ పని చేసినా అంతర్గతంగా అది బీజేపీకి లాభం చేసే విధంగా ఉంటుందని అన్నారు.అంతేగాక,ముఖ్యమంత్రి కేసీఆర్ మూలాలు బిహార్లో ఉన్నాయని,అందుకే ఆయన బిహార్ అధికారులపై అతిప్రేమ చూపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, మంత్రి హత్యకు కుట్ర అనే డ్రామాకు తెరలేపి ప్రశాంత్ కిషోర్ యాక్షన్ ప్లాన్ను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసి సానుభూతి పొందాలని చూస్తున్నాడని ఆమె ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో మహిళా గవర్నర్కు విలువ లేకుండా చేశారని,అన్ని అధికార వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని కేసీఆర్ రాజరిక పాలన చేయాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు.