ఏపీలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు విజయం సాధించారు.ఈ విజయం కనీవినీ ఎరుగని అప్రతిహత విజయం అనే చెప్పాలి.
ఈ విజయం సాధించిన వారిలో చాలా మంది కొత్త వారే ఉన్నారు.ఎక్కువ మంది యువకులు, ఉన్నత విద్యావంతులు ఉన్నారు.
ఏళ్లకు ఏళ్లుగా రాజకీయాల్లో పాతుకుపోయిన వారి కన్నా జగన్ కొత్తవారినే ఎక్కువుగా ఎంపిక చేసుకున్నారు.ఈ క్రమంలోనే జగన్ వేవ్ బాగా పనిచేయడంతో పాటు కొత్త నేతలకు క్లీన్ ఇమేజ్ ఉండడంతో వీరంతా తిరుగులేని విజయాలు సాధించారు.
అయితే వీరిలో చాలా మందికి ఇప్పుడు పాలనా పరమైన అనుభవం లేకపోవడంతో పాటు, ప్రజల్లోకి చొచ్చుకుపోయే లక్షణాలు లేకపోవడం.భాషా పరమైన సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ కొత్త ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్య గ్యాప్ ఎక్కువుగా కనిపిస్తోంది.ఈ లిస్టులోనే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్ ఉన్నారు.
గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలిచిన ఆమె ఇప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆమె ఎక్కువుగా పక్క రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరులోనే నివాసం ఉంటోన్న పరిస్థితి.పైగా ఉన్నత విద్యావంతురాలు కావడంతో ఆమెకు నియోజకవర్గ నాయకులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువుగా ఉంది.ఇక నియోజకవర్గంలో పార్టీ నాయకులకు కూడా ఎమ్మెల్యేను కలవడం కష్టంగానే ఉందట.
ఆమె ఏకంగా ముగ్గురు పీఏలను నియమించుకున్నారు.వీరిని దాటుకున్నాక ఎమ్మెల్యే పర్మిషన్ ఇస్తేనే ఆమెను కలిసే అవకాశం ఒకరో ఇద్దరో నాయకులకు వస్తోందట.
దీంతో నాయకులు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.ఆమెతో మాట్లాడినా ఆమె ఇంగ్లీష్లోనే సమాధానాలు చెపుతున్నారట.ఆమె మాట్లాడే తెలుగు / ఇంగ్లీష్ కళ్యాణ్దుర్గం పార్టీ నాయకుల్లో చాలా మందికి అర్థంకాని పరిస్థితి.ఇక్కడే కేడర్కు ఎమ్మెల్యేకు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతోందని అంటున్నారు.
దీంతో ఏపీలో చాలా నియోజకవర్గాల్లో నాయకులది ఒక బాధ అయితే కళ్యాణదుర్గం వైసీపీ నాయకులది మరో బాధగా సెటైర్లు పడుతున్నాయి.