పాలకడలి నుంచి శ్రీ మహావిష్ణువు ఉద్భవించిన క్షేత్రమే శ్రీరంగం.సమున్నత గోపురాలతో, విశాల ప్రాకారాలతో, శ్రీరంగనాధుని నామస్మర ణలతో నిత్యం మార్మోగే దివ్యక్షేత్రం శ్రీవైష్ణవ వైభవానికి పట్టుగొమ్మలా వెలుగొందుతోంది.108 దివ్యదేశాల్లో పవిత్రమైన ఈ క్షేత్రం తమిళనాడులో నెలకొంది.కోయిల్ అంటే శ్రీరంగం, మలై అంటే తిరుమల అంటారు.
శ్రీరంగాన్ని పెరియకోయిల్ అని కూడా అంటారు.దీనర్థం పెద్ద దేవాలయం అని.శ్రీరంగనాధుడు శయనమూర్తిగా వుండి భక్తులకు ఆశీస్సులు అందిస్తుంటారు.దాదాపు 157 ఎకరాల్లో నెలకొన్న ఆలయం ప్రపంచంలోని పెద్ద దేవాలయం అంటారు.
కంబోడియాలోని అంగ్కార్వాట్ ప్రపంచంలోనే పెద్ద దేవాలయం అయితే అది పర్యాటక స్థలం మాత్రమే.దీంతో నిత్యం పూజలందుకుంటున్న క్షేత్రాల్లో శ్రీరంగమే పెద్దది.
శ్రీరంగనాథుడిని దర్శించినంతనే మనకు సాక్షాత్తు ఆ శేషసాయిని దర్శించున్న దివ్యానుభూతి కలుగుతుంది.వేల సంవత్సరాలుగా కోట్లాది భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్న శ్రీరంగ పుణ్యక్షేత్ర సందర్శన మనకు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది.
స్థల పురాణం. సీతా అపహరణం తరువాత అగ్రజుడైన రావణుడికి అతని సోదరుడు విభీషణుడు పలు హితవచనాలు చెబుతాడు.స్త్రీలను అపహరించడం తగదనిహితవు పలుకుతాడు.అయితే రావణుడు ఈ మాటలను పెడచెవిన పెడ్తాడు.
దీంతో విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చి ఆశ్రయం పొందుతాడు.రావణ వధ అనంతరం విభీషణుడి భక్తికి మెచ్చిన రాముడు రంగనాధుడి విగ్రహాన్ని అతనికిస్తాడు.
లంకకు వెళ్లే సమయంలో ఎక్కడా నేల మీద వుంచకూడదని షరతు విధిస్తాడు.లంకకు వెళుతున్న విభీషణుడు కావేరి దాని ఉపనది మధ్యలో వున్న ద్వీపంలో కాసేపు విశ్రమించేందుకు ఉపనది మధ్యలో వున్న ద్వీపంలో కాసేపు విశ్రమించేందుకు భూమిపై విగ్రహాన్ని వుంచుతాడు.
అనంతరం తిరిగి వెళ్లే సమయంలో విగ్రహాన్ని తీసుకువెళ్లేందుకు యత్నిస్తుండగా విగ్రహం రాలేదు.ఆ ప్రదేశాన్ని పాలించిన ధర్మచోళుడు విభీషణుడిని ఓదార్చుతాడు.
స్వామివారు కూడా అక్కడే వుండేందుకు ఇష్టపడటంతో దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.విభీషణుడి కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కునకు తిరుగుతారు.