మోదీ రెండోసారి గద్దెనెక్కిన తర్వాత ఎన్నో వివాదాస్పద బిల్స్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు.లోక్సభలో ఎలాగూ బీజేపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది.
రాజ్యసభలో అంశాల వారీగా టీఆరెస్, వైసీపీ, టీడీపీలాంటి పార్టీల మద్దతు కూడగడుతోంది.దీంతో ట్రిపుల్ తలాఖ్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, తాజాగా పౌరసత్వ సవరణ చట్టాన్ని సునాయాసంగా ఆమోదింపజేసుకున్నారు.

చట్టసభలైతే వీటికి ఆమోదం తెలిపాయి కానీ.ప్రజల నుంచే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 విషయంలో దేశంలో చాలా వరకూ అన్ని వర్గాల మద్దతు కూడగట్టినా.పౌరసత్వ సరవణ చట్టం విషయంలో అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది.
భారత పౌరసత్వం అనేది మతాలకు అతీతం.కానీ తాజా సవరణతో ప్రత్యేకంగా ఒక మతానికి ఇవ్వడం కుదరదన్న నిబంధన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
దీంతో ఈ సవరణ ద్వారా ప్రభావితమయ్యే ముస్లిం, ఈశాన్య రాష్ట్ర ప్రజలు, విద్యార్థులే కాదు.ఇతర వర్గాల వాళ్లు కూడా దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొంటున్నారు.ఢిల్లీలో జామియా మిలియా యూనివర్సిటీలో ప్రారంభమైన నిరసనలకు మద్దతుగా, అక్కడి విద్యార్థులతో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

దేశంలోని ముస్లిం యూనివర్సిటీలే కాదు.జేఎన్యూ, జాదవ్పూర్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లతోపాటు ఐఐటీ, ఐఐఎంలకు చెందిన విద్యార్థులు కూడా ఈ నిరసనల్లో పాల్గొనడం విశేషం.దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల విద్యార్థులూ తమ సంఘీభావం తెలిపారు.
ఇది కచ్చితంగా మోదీకి డేంజర్ బెల్సే అని చెప్పాలి.దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరిగిపోతోంది.దాని తాలూకు అసంతృప్తి విద్యార్థుల్లో తీవ్రంగా ఉంది.ఇలాంటి ఏవైనా నిరసన తెలిపే అవకాశం ఉన్న ఘటనలు జరిగినప్పుడు విద్యార్థుల్లోని ఆ ఆవేశం బయటకు వస్తోంది.
ఈ మధ్య తెలంగాణలో జరిగిన దిశ ఘటన సందర్భంగా అయినా, ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టంపై అయినా ప్రజలు స్వచ్ఛందంగా నిరసనలు తెలపడానికి ప్రభుత్వాలపై ఉన్న అసంతృప్తే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.