కొన్ని వారాలుగా నోటుకు ఓటు వివాదం, ఫోన్ ట్యాపింగ్ తలనొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ప్రశాంతంగా గడిపారు.అంటే నిద్రపోయారా? కాదు.యోగాసనాలు వేసి, ధ్యానం చేసి సేద తీరారు.వ్యక్తిత్వ వికాసం, యోగా మొదలైనవన్నీ చంద్రబాబుకు ఇష్టమైన కార్యక్రమాలు.గతంలో ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు వ్యక్తిత్వ వికాసం క్లాసులు నిర్వహింపచేశారు.తానూ ఒక విద్యార్థిగా పాల్గొన్నారు.
ఇప్పుడు యోగా కార్యక్రమంలో తాను పాల్గొనడంతోపాటు మంత్రులను, అధికారులను భాగస్వాములను చేశారు.యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు, ప్రమోషన్కు పాతిక కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
జీవితాంతం యోగా చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్నవారితో ప్రతిజ్ఞ చేయించారు.యోగాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు.
దీని కోసం ఎంతయినా ఖర్చు చేస్తామన్నారు.యోగా మన పూర్వీకులు మనకు ఇచ్చిన పెద్ద ఆస్తి అని బాబు అన్నారు.
యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీని బాబు ప్రశంసించారు.మొత్తం మీద చాలారోజుల తరువాత బాబు ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించారు.
తాను ఉమ్మడి రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు, పార్టీ నాయకులకు నిర్వహింపచేసిన మెడిటేషన్, వ్యక్తిత్వ వికాస క్లాసుల గురించి గుర్తు చేసుకున్నారు.