నల్లగొండ జిల్లా: నకిరేకల్ పట్టణంలోని సర్వే నెంబర్ 89లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ప్రైవేట్ శక్తులపై చర్యలు తీసుకోకపోతే ఆ భూమిని ఆక్రమించి పేదలతో వందలాది ఇండ్లను నిర్మింపచేస్తామని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.గురువారం నకిరేకల్ మున్సిపాలిటీలోని స.నెం.89 దండెకుంటలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా గేట్లు వేసిన ప్రైవేట్ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాసవీ కాలేజీ ప్రక్కన గల ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాల వద్ద ఆందోళన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో వాటిని తొలగించి నిలువ నీడలేని వందలాది మంది నిరుపేదలతో పక్కా నివాసాలను ఏర్పాటు చేస్తామని అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు.జిల్లా సర్యేయర్ దీనిని ప్రభుత్వ భూమి అని తేల్చి, మున్సిపల్ కమీషనర్ చెట్లు నాటిన తరువాత ఏవిధంగా ప్రైవేట్ భూమి అవుతుందో జిల్లా కలెక్టర్ తేల్చాలని అన్నారు.ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తే కిమ్మనకుండా ఉన్న అధికార యంత్రాంగం పేదల హక్కులను ఎలా అడ్డుకుంటారో చూస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నేరేడు లింగయ్య యాదవ్,దుర్గం జలంధర్,మాగి సైదులు, కప్పల రాకేష్ గౌడ్, మహేశ్వరం సుధాకర్, చౌగోని సైదులుగౌడ్, పెంటమళ్ళ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.