యాదాద్రి జిల్లా:ఆలేరు మండలం కాల్వపల్లి గ్రామ శివారులోని వాగు నిర్విరామంగా ప్రవహిస్తూ,దాదాపు సంవత్సరం నుండీ రోడ్డుపై నీరు పారుతూనే ఉందని, అయినా ఇటువైపు ఏ ప్రజా ప్రతినిధులు,అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు కొల్లూరు రాజయ్య,సిపిఐ మండల కార్యదర్శి చిగుర్ల లింగం అన్నారు.బుధవారం వారు వాగు ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఈ వాగును పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతిరోజు ఈ రోడ్డుపై దాదాపు 20 నుండి 30 వేల మంది వరకు ప్రయాణం చేస్తుంటారని,గతంలో ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయని గుర్తు చేశారు.
నిరంతరం రోడ్డుపై నుండి నీరు పారడం వలన రాళ్లు తేలి బాటసారులకు,వాహనాలకు గుచ్చుకొని ఇబ్బందిగా మారాయన్నారు.ప్రతిరోజు యాదగిరిగుట్ట నుండి కొమరవెల్లికి వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారని,ఈ వాగుపై వంతెన నిర్మాణం చేయకపోవడం వల్ల నిత్యం నరకయాతన పడుతున్నారని మండిపడ్డారు.
వెంటనే ప్రభుత్వం టెండర్లు పిలిచి,ఈ బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో అక్కడ దత్తత తీసుకోవడం కాదని,తెలంగాణలో ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచి, అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గం ఉందా లేదా అని ప్రశ్నించారు.ఆలేరు నియోజకవర్గ పరిధిలోని అన్ని వాగులపై ప్రభుత్వం వెంటనే బ్రిడ్జిలు నిర్మించాలని,లేనియెడల మండల ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గ్రామ శాఖ అధ్యక్షుడు చెన్న శ్రీను,ఎండి దస్తగిరి,పిల్లలమర్రి ఆంజనేయులు,దాసరి రమేష్,కర్నాటి రాజేష్,గాంధాల వెంకటేశం,గాంధాల మల్లేశం,చెన్నా అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.