చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ఉయిగర్ ముస్లిం మైనారిటీలపై ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందన్న తీవ్ర ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి.వారిని ప్రత్యేక క్యాంపుల్లో నిర్బంధించి హింసిస్తూ, చైనా తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ జిన్ జియాంగ్ ప్రావిన్స్ అంశంపై చర్చకు ప్రతిపాదన చేయగా, ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది.మరో 10 దేశాలు కూడా ఓటింగ్ లో పాల్గొనలేదు.
అంతేకాదు, చైనాకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం భారత్ కు ఉన్నా ఓటింగ్ కు గైర్హాజరైంది.ఈ ఓటింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత భారత్ స్పందించింది.
చైనాలోని ఉయిగర్ ముస్లింల అంశంపై తొలిసారి బహిరంగంగా తన అభిప్రాయాలను వెల్లడించింది.జిన్ జియాంగ్ ప్రావిన్స్ లోని ప్రజల మానవ హక్కులను గౌరవించాలని, హక్కుల పరిరక్షణకు భరోసా ఇవ్వాలని భారత్ పిలుపునిచ్చింది.
సంబంధింత వర్గాలు ఈ అంశాన్ని తగిన రీతిలో పరిష్కరించాలని సూచించారు.