భార్యభర్తల బంధంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి.ఎలాంటి కష్టం అయిన ఇష్టంతో ఒకరితో ఒకరు పంచుకుని ముందుకి వెళ్ళాలి.
అయితే ఆధునిక ప్రపంచంలో వివాహ బంధంలో ఆధిపత్యం, అనుమానం, అవమానం, వ్యసనం అనేవి ప్రమాదకరంగా మారాయి.వీటి కారణంగా ఆ బంధాలు విచ్చిన్నం అవుతున్నాయి.
తప్పుడు పనులు చేసేలా ప్రేరేపిస్తున్నాయి.ఇప్పుడు అలాంటి తప్పుడు పనికి పాల్పడిన ఘటన ఒకటి బయటపడింది.
కట్టుకున్న భార్యను బ్లాక్ మెయిల్ చేసిన ఓ ప్రబుద్ధుడు కోటి వసూలు చేసిన ఘటన హైదరాబాదులోని గచ్చిబౌలిలో వెలుగుచూసింది.సంతోష్ అనే యువకుడు భార్యను డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తూ ఇప్పుడు కటకటాల వెనక్కి చేరాడు.
సంతోష్ భార్య ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అమెరికాలో ఉద్యోగం చేస్తోంది.వ్యసనాలకు బానిసైన సంతోష్ భార్యను వేధించేవాడు.అయితే ఆమెని వేధించడం తగ్గించి మరో కొత్త ఉపాయం వేశాడు.స్నేహితుడి పేరుతో భార్యకు అశ్లీల సందేశాలు, వీడియోలు పంపేవాడు.
ఆ అసభ్య వీడియోలు, సందేశాల ఆధారంగా భార్యను తెలియకుండా అజ్ఞాతవ్యక్తిగా బ్లాక్ మెయిల్ చేసి కోటి రూపాయల వరకు రాబట్టాడు.అయితే ఇది ఎవరి పనో అర్థంకాక ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కొన్నాళ్లు మౌనంగా ఉన్నా, చివరికి భర్తపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దాంతో సంతోష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడికి తమ ట్రీట్మెంట్ రుచి చూపించడంతో విషయం బయటపెట్టాడు.సంతోష్ గతంలో కొంతమంది మహిళలతో ఇలాగే వ్యవహరించినట్టు పోలీసులు తెలుసుకున్నారు.