జేడీ లక్ష్మీనారాయణ ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు.వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో లక్ష్మీనారాయణ కు వచ్చిన పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు.
నీతికి నిజాయితీకి మారుపేరుగా లక్ష్మీనారాయణ పేరు అప్పటికీ ఇప్పటికీ మారుమోగుతుంది వస్తోంది.కేవలం జగన్ అక్రమాస్తుల కేసులోనే కాకుండా, కర్ణాటక మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ని అరెస్టు చేసిన వ్యవహారంలోనూ లక్ష్మీనారాయణ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
నీతికి నిజాయితికి మారుపేరుగా ఆయన నిలిచారు.ఇక ఆ తరువాత ఆయన మహారాష్ట్ర క్యాడర్ కు వెళ్లిపోవడం, తరువాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల వైపు వెళ్లడం తెలిసిందే.
ఆ తరువాత సొంతంగా పార్టీ పెడతారనే ప్రచారం జరిగినా, ఆయన మాత్రం అనూహ్య పరిణామాల మధ్య జనసేన పార్టీలో చేరారు.
గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేసి ప్రత్యర్థులకు గట్టిపోటీనే ఇచ్చిన ఆయనకు ఓటమి పలకరించింది.
ఇక ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు జేడీ.ఇక ఆ తరువాత బిజెపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఒక వైపు పెద్ద ఎత్తున జరుగుతుండగా ఆయన ఏపీ సీఎం జగన్ కరోనా వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడడం, జగన్ వ్యాఖ్యలను సమర్థించడంతో ఆయన వైసీపీలో చేరబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అయితే ఇదే విషయమై లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు.
ప్రజల్ని ,సమాజాన్ని, దేశ ఆలోచనా విధానాన్ని మార్చేందుకు ఎప్పుడైనా, ఏదైనా రాజకీయ పార్టీతో సాధ్యం అనుకుంటే, ఆ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయం అప్పుడు తీసుకుంటాను అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.కానీ సూటిగా వైసిపిలోకి వెళ్ళే ఆలోచన లేదు అని మాత్రం ఆయన ఖండించడం లేదు.ఇక జగన్ అక్రమ ఆస్తుల కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ, సిబిఐ జేడి గా ఉన్న సమయంలో విధి నిర్వహణలో భాగంగా దాదాపు 32 వరకు కేసులను దర్యాప్తు చేయాల్సి వచ్చిందని, సిబిఐ ని వదిలేసి ఏడు సంవత్సరాలు అవుతోందని, ఆ కేసుల సంగతి తనకు తెలియదని ఆయన చెప్పారు.
అయితే ఆయన వైసీపీ లో చేరడం లేదు అనే విషయం క్లారిటీగా ఖండించ లేకపోతున్నారు.రాజకీయాల్లో ఎవరి అజెండా వారికి ఉంటుందని, ప్రజాస్వామ్యంలో ఇదంతా భాగమై ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
తాను జనసేన పార్టీకి ఇంకా కొంచెం ముందుగా రాజీనామా చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.మొత్తంగా చూస్తే జెడి వైసీపీలో చేరబోతున్నారా అనే విషయంపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదు.
అలా అని చేరే ఉద్దేశం తనకు లేదు అనే విషయాన్ని సూటిగా కూడా చెప్పక పోవడంతో ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి గా ఉన్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది.