సూర్యాపేట జిల్లా:బీజేపీ పాలనలో దేశం తిరోగమనo చెందుతుందని,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో సాగుతున్న సుభిక్షమైన పాలనను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.
నేడు అభివృద్ధి చెందిన దేశాల సరసన తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని,ముఖ్యమంత్రి కేసీఆర్ ను,టీఆర్ఎస్ ను తెలంగాణకే పరిమితం చేయాలని బీజేపీ ఎన్నో కుట్రలు చేస్తున్నదన్నారు.తెలంగాణపై బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ,రాష్ట్రంలో అనేక రకాల మోసాలకు,ద్రోహలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
ఇవాళ పంజాబ్ ను మించి అత్యధిక వరిని పండిస్తున్నది తెలంగాణ అని,వడ్లను కొనకుండా బీజేపీ ఇబ్బందులు పెడుతుందని, సాకులు చూపి తెలంగాణ రైతులను నట్టేట ముంచేలా కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.తెలంగాణ రైతుల పక్షాన టీఆర్ఎస్ ఎంతకైనా కొట్లాడుతుందని,పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బీజేపీ మోసాలను ఎండగట్టాలని,రేపటి నుండి నియోజకవర్గలాల్లో ఎక్కడికక్కడ మీటింగ్ లు పెట్టి రైతులను సంఘటితం చేసి,బీజేపీ దుష్ట పాలనను, వివక్షను ఎండగడతామని,తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కేంద్రంపై పోరాటం చేస్తామని,వడ్లు కొనే దాకా కేంద్రాన్ని విడిచి పెట్టమని స్పష్టం చేశారు.
బీజేపీ దేశానికే ప్రమాదకరంగా మారిందని,ముఖ్యంగా రైతుల పాలిట శనిలా దాపురించిందని విమర్శించారు.