ఈటెల రాజేందర్ వ్యవహారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్ పార్టీ దాని నుంచి బయటపడేందుకు పార్టీలో చేరికల పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది.దీనిలో భాగంగానే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ ను పార్టీలో చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
ఆయన తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా ఉండడంతో కాస్తో కూస్తో ఉన్న టిడిపికి ఓటు బ్యాంకును టీఆర్ఎస్ వైపు మళ్ళిస్తే రాబోయే ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంకు తమకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ రమణ ను టీఆర్ఎస్ వైపు తీసుకువచ్చేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు ఆ బాధ్యతలు అప్పగించారట.
ఇప్పటికే తెలుగుదేశం తెలంగాణ లో ఉన్నా, లేనట్టుగా ఉంది.ఈ పరిస్థితుల్లో రమణ తన రాజకీయ భవిష్యత్తు వెతుక్కోవడం పెద్దగా ఆశ్చర్యం ఏమి కలిగించడం లేదు.
ఇటీవలే ఆయన హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి ఓటమి చెందారు.ఇక టీడీపీకి తెలంగాణలో భవిష్యత్తు కష్టమని డిసైడ్ అయిన ఆయన పార్టీ మారడమే కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చేశారు.
ఆయనకు అనేక పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.టిఆర్ఎస్ నుంచి రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ప్రతిపాదనను కూడా వచ్చినట్లు తెలుస్తోంది.ఇక పార్టీ మార్పు విషయమై స్పందించిన ఆయన టిఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల తనకు ఫోన్ చేసి కేసీఆర్ మిమ్మల్ని గుర్తు చేశారని చెప్పినట్లు రమణ తెలిపారు.టిఆర్ఎస్ నుంచి గతంలోనూ ఆఫర్ వచ్చిందని ఇటువంటి ఆఫర్లు రావడం తనకు కొత్తేమీ కాదు అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం తనను కలిసిన సందర్భంలో రాజకీయ భవిష్యత్తు గురించి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారని, ప్రస్తుతానికి తాను ఏ నిర్ణయం తీసుకోలేదని, తన అనుచరులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని రమణ చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ లోకి వెళ్లడమా ? టీఆర్ఎస్ వైపు వెళ్తే తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయంపై ఆయన ఆరా తీసుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఏది ఏమైనా రమణ పార్టీ మారడం అయితే తధ్యం.అది బిజెపి నా లేక టీఆర్ఎస్ పార్టీనా అనేది అతి తొందర్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.