గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హడావుడి సృష్టిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.అలాగే ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు.
రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతున్నారు.పాల్ వ్యాఖ్యలను జనం పెద్దగా సీరియస్ గా తీసుకోకపోయినా, టఆర్ఎస్ మాత్రం ఆయనకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.ఇదిలా ఉంటే కే ఏ పాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ పైన ,ఆయన కుటుంబ సభ్యుల పైన సిబిఐకి ఫిర్యాదు చేశారు.వీరంతా అవినీతికి పాల్పడ్డారని సిబిఐ డైరెక్టర్ సుకుమార్ జైస్వాల్ కు ఫిర్యాదు లేఖను ఇచ్చారు.
తెలంగాణలో 9 లక్షల కోట్ల అవినీతికి కెసిఆర్ ఆయన కుటుంబం పాల్పడిందని కె ఏ పాల్ ఆరోపించారు.ప్రపంచంలో ఎక్కడా జరగని అవినీతి తెలంగాణలో జరిగిందని, తెలంగాణ ప్రజలంతా కెసిఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారు అని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, వీటిపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో తెలంగాణకు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు పేర్కొన్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ , కవిత పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని పాల్ ఆరోపించారు.తెలంగాణతో పాటు, సింగపూర్, దుబాయ్ అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టినట్టుగా పాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని, ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా ఐదువేల కోట్ల రూపాయలు కాగా, 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, 75 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు.యాదాద్రి పునర్ నిర్మాణ పనుల్లోనూ అవినీతి జరిగిందని విమర్శించారు.రెండు వేల కోట్ల అంచనాలో 200 కోట్లు ఖర్చు చేసి అంతా దోచుకున్నారని, కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.కెసిఆర్ కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు.
కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని, కేసీఆర్ అవినీతి అక్రమాలపై దర్యాప్తు కు తాను పూర్తి సహకారం అందిస్తానని సీబీఐ కు ఇచ్చిన లేఖలో పాల్ పేర్కొన్నారు.