సూర్యాపేట జిల్లా: వంశంలో చదువుకున్న విద్యావంతుడు అనుకోని భూములను సమభాగాలుగా పంపకం కల్పించాలని కోరగా,అదే అదునుగా భావించిన సదరు వ్యక్తి స్వార్ధంతో భూమిని ఆక్రమించుకోని,పట్టా చేసుకున్న ఘటన జిల్లాలో వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే బాధితుల కథనం ప్రకారం…చివ్వెంల మండలం కుడకుడకు చెందిన పిండిగా వంశస్థులు శుక్రవారం కుడకుడ నూతన కలెక్టరేట్ భవనం వద్ద టెంట్లు వేసి ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము తమ తండ్రికి ఆరుగురు వారసులం కాగా, తమకు వ్యవసాయానికి సహకరించేందుకు విశ్వబ్రాహ్మణులు ఒకరికి కలుపుకొని మొత్తం ఏడు భాగాలుగా ఉన్నామని తెలిపారు.తమకు కుడకుడ గ్రామ శివారులో వేరువేరుగా 18 రకాల సర్వే నెంబర్లలో నూట పదిహేను ఎకరాల ఇరవై ఏడు గుంటల భూమి ఉండగా,దానిని ఏడు భాగాలుగా విభజించగా ఒక్కొక్కరికి పదిహేను ఎకరాల తొమ్మిది గుంటల భూమి రావాల్సి ఉంది.
మా వంశంలో చదువుకున్న విద్యావంతుడైన పిండిగ కరుణాసాగర్ (డిఈ పంచాయతీరాజ్ నకిరేకల్ లో పనిచేస్తున్నారు) మా అందరి వద్ద భూమి తీసుకుని తన భార్య ఏడిండ్ల పుష్పలత తాహసీల్దార్ కావడంతో అక్రమంగా భూపట్టాలు చేసుకున్నారని ఆరోపించారు.పొత్తుల భూమిని సమాన భాగాలు చేయకుండా వేరే వారికి భూమి అమ్మి తమకు అన్యాయం చేశారని ఆరోపించారు.
ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి పిండిగా కరుణాకర్,ఏడిండ్ల పుష్పలతలు అక్రమంగా చేయించుకున్న భూమిని పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దుచేసి భాగస్థులందరికీ సమానంగా పంపకం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.కరుణాసాగర్ భార్య తహశీల్దారు కావడంతో గ్రామంలో పాలివారి దగ్గర భూమి కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా భూమి తన పేర పట్టా చేయించుకున్నట్లు తెలిపారు.
అయినప్పటికీ తాము ప్రతి వ్యక్తి(ఒక భాగం) రెండు గుంటల చొప్పున కరుణాసాగర్ కు దానం చేశామని,దానిని సాకుగా పెట్టుకుని వారు మా భూమిని పట్టా చేయించుకున్నారని ఆరోపించారు.ప్రభుత్వ అధికారులు కరుణాసాగర్ పుష్పలతల మోసాన్ని గమనించి వారి పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దుచేసి మా భూమిని సమభాగాలుగా పంపిణీ చేయాలని కోరారు.
అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన నకిరేకల్ పంచాయితీ రాజ్ డిఈపై రేపటి నుండి మంత్రికి,నకిరేకల్ ఎమ్మెల్యేకి,సూర్యాపేట కలెక్టర్ కి, ఆర్డీవో,చివ్వెంల తహసీల్దార్ కు ఫిర్యాదు చేయనున్నట్లు,వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.ధర్నాలో పిండిగా వంశస్థులు పిండిగా ఫౌలు,పిండిగా రవి,పిండిగా కళామణి,పిండిగా అశోక్,పిండిగా మణి,పిండిగా ఏలియా,పిండిగా జార్జి,పిండిగా నర్సయ్య,పిండిగా సుగుణ,పిండిగా ప్రకాశం,వారి కుమార్తెలు,తదితరులు పాల్గొన్నారు.