ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలామంది భక్తులు (వీరాభిమానులైన పార్టీ నాయకులు) ఉన్నారు.వీరు పావలాకు రూపాయి యాక్షన్ చేస్తారు.
భక్తీ పారవశ్యంతో మైమరచి పోతారు.వారు ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియదు.
కొన్ని విషయాలను జ్యోతిష్కుల కంటే ఎక్కువగా బల్ల గుద్ది చెబుతారు.చంద్రబాబు భక్తుల్లో ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఒకరు.
ఈయన టీవీ చానెళ్ళ చర్చా కార్యక్రమాల్లో ఎవ్వరినీ మాట్లాడనివ్వకుండా పెద్ద గొంతు పెట్టుకొని అరుస్తుంటారు.ఈయనకు ఎందుకో భక్తి మత్తు ముంచుకొని వచ్చింది.ఆ మత్తులో చంద్రబాబు భవిష్యత్తు ఏమిటో చెప్పారు.2019 ఎన్నికలు ముగిసిన తరువాత ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోడీ ఉండరు.రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం లేదు.మరి ప్రధాని ఎవరు అవుతారు? చంద్రబాబు నాయుడు అవుతారు.ఎలా అవుతారో రాజేంద్ర ప్రసాద్ వివరించలేదు.మూడున్నర ఏళ్ళ తరువాత జరిగే విషయం ఆయన మాత్రం ఏం చెబుతాడు? కానీ చంద్రబాబు ప్రధాని అవుతాడనే నమ్మకం ఆయనకు ఉంది.అవుతాడో , కాడో చెప్పలేము కానీ తనకు ప్రధాని అయ్యే అవకాశం వస్తే వదులుకున్నానని బాబు అప్పుడప్పుడు చెబుతుంటారు.సరే … చంద్రబాబు ఒక్కడి గురించి జ్యోతిష్యం చెప్పడం బాగుండదని అనుకున్నట్లుగా ఉంది.
వెంకయ్య నాయుడిని కూడా కలిపారు.ఆయన దేశానికి కాబోయే రాష్ట్రపతి అని చెప్పారు.
ఇద్దరు నాయుడులు తెలుగు ప్రజలకు అమోఘమైన సేవలు చేస్తున్నారని పొగిడారు.ఇలా చెప్పడం వల్ల రాజేంద్ర ప్రసాదుకు ఏమైనా ప్రయోజనం ఉందా ?
.