ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పేరుకు జాతీయ పార్టీ అయినా, ఏపీలో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.2014 నుంచి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.ఏపీ లో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ ఓటమే ఎదురవుతూ వస్తోంది.
ఈ సమస్య నుండి బయటపడే పరిస్థితి కోసం కాంగ్రెస్ అనేకరకాలుగా ప్రయత్నిస్తూనే వస్తోంది.ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఉన్నారు.
ఆయన పెద్దగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి బలోపేతం చేసే విషయంలో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.ఈ క్రమంలోనే శైలజానాథ్ ను తప్పించి ఆయన స్థానంలో మరో బలమైన నాయకుడిని అధ్యక్షుడు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది.
అయితే కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకురాగల బలమైన నేత ఎవరు అనే విషయం లో మాత్రం ఏ క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు.ప్రస్తుతం ఏపీలో వైసీపీ బలం గా ఉంది.
ఆ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా అండదండలు అందిస్తుంది.ఈ క్రమంలో కాంగ్రెస్ కు కాస్తో కూస్తో బలం పెరగడానికి, వైసీపీని దెబ్బ కొట్టేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు పిసిసి అధ్యక్ష పదవి అప్పగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది.
ఇదిలా ఉంటే 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పోటీ చేసినా ఫలితం ఉండదని, కాబట్టి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కొన్ని స్థానాలు దక్కించుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు.
![Telugu Ap Congress, Congress, Janasena, Raghuveera, Rahul Gandi, Sonia Gandi, Td Telugu Ap Congress, Congress, Janasena, Raghuveera, Rahul Gandi, Sonia Gandi, Td](https://telugustop.com/wp-content/uploads/2021/11/ap-congress-ap-congress-sake-sailajanath-raghuveerareddy-bjp-tdp-janasena-td.jpg )
ఇప్పటికీ ఏపీ కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఒక క్లారిటీ కి వచ్చారు.కాకపోతే టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం బిజెపితో పొత్తు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ పార్టీ నేతలు పెద్దగా పొత్తు విషయంలో ఆసక్తి చూపించకపోయినా, బాబు మాత్రం బిజెపి పొత్తు కోసం విరామం లేకుండా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
అయితే బిజెపి, టిడిపి పొత్తు కనుక కుదరకపోతే టీడీపీతో తాము పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందట.కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవకపోయినా, క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారు.
అలాగే కొన్ని సామాజిక వర్గాల ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు ఉంది.
దీంతో ఈ విషయంలో చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు.
బీజేపీ పొత్తు లేకపోతే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు.కాంగ్రెస్ తో జత కలిస్తే ఓట్లతో పాటు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా తమకు కలిసి వస్తాయి అనేది బాబు అంచనా గా ఉంది.
ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేసే అంత సామర్థ్యం లేదు.అందుకే కొన్ని సీట్లలో అయినా పొత్తు పెట్టుకోవడం ద్వారా కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.
కాంగ్రెస్ కోరిక నెరవేరడం అనేది ఇప్పుడు బాబు చేతుల్లోనే ఉంది.