తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ లో రోజు రోజుకి అసంతృప్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది.ఇప్పటికే టికెట్ల ప్రకటన దాదాపు పూర్తి కావడంతో టికెట్ దక్కని వారు తీవ్ర అసంతృప్తి కి గురయ్యారు.
ఇప్పటికే చాలామంది పార్టీ మారే ఆలోచనలో ఉండగా, మరికొంతమంది కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.టికెట్ దక్కని వారి అసంతృప్తి ఈ విధంగా ఉంటే… టికెట్ దక్కినా, తమ వారసులకు టికెట్ దక్కకపోవడం తో అసంతృప్తి కి గురైన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
ముఖ్యంగా మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( Mynampally Hanumanth Rao ) తన కుమారుడు కి టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తి కి గురై కాంగ్రెస్ లో చేరే ఆలోచనలో ఉన్నారు.ఇప్పటికే కాంగ్రెస్ తో మంతనాలు చేశారు.
మైనంపల్లి హనుమంతు రావు తో పాటు, ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా బుజ్జగింపులకు దిగినట్టు తెలుస్తోంది.ఈ మేరకు బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత రంగంలోకి దిగి మైనంపల్లి తో మంతనాలు మొదలుపెట్టారట.అయితే మైనంపల్లి మాత్రం తాను ఎవరి మాటా వినే ప్రసక్తి లేదు అని, స్వయంగా కేసీఆర్( CM KCR ) తనతో మాట్లాడి తనకు హామీ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారట.
దీంతో మైనంపల్లి తో మంతనాలు చేస్తున్న సదరు నేత ఇదే విషయాన్ని నేరుగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట.ఈనెల 17న కాంగ్రెస్ నిర్వహించబోతున్న బహిరంగ సభలో ఆ పార్టీ ఆగ్రనేతలు సోనియా , రాహుల్, ప్రియాంక గాంధీ( Priyanka Gandhi )లు హాజరుకాబోతున్న నేపథ్యంలో ఆ సభలోనే మైనంపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం మొదలయ్యింది.
మైనంపల్లి కాంగ్రెస్ లోకి వెళితే బిఆర్ఎస్( BRS party ) కు జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చిన బీఆర్ఎస్ అధిష్టానం ఆయనను బుజ్జగించేందుకు పార్టీకి చెందిన కీలక నేతకు బాధ్యతలు అప్పగించినా, స్వయంగా కేసీఆర్ తనతో మాట్లాడాలని మైనంపల్లి హనుమంతరావు షరతులు పెడుతుండడంతో, ఈ విషయంలో ఏం చేయాలనే సందిగ్ధంలో కేసీఆర్ ఉన్నారట.