జూన్ 2వ తేదీని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.ఈ సందర్భంగా పలు జిల్లాలో ప్రజలను ఉత్సాహపరిచే ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర అవతరణకు సాగించిన పోరాటాలపై ప్రజల్లో స్పూర్తి రగిలించేలా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు.ఇందులో భాగంగా ప్రజలకు పలు క్రీడా పోటీలను తలపెట్టారు.
అందులో పరుగు పందేలు కూడా ఒకటి.ఇందులో పాల్గొంటున్న సామాన్యుల కథలు ఎంతో స్పూర్తినిస్తోంది.
ఆ మహిళ గెలిచిన విధానాన్ని తెలుసుకున్న వారంతా కన్నీరు పెడుతున్నారు. కాళ్లకు రాళ్లు గుచ్చుకుంటున్నా, ఎంతో నొప్పి పుడుతున్నా ఓ మహిళ పరుగు పందెంలో తన లక్ష్యాన్ని చేరుకుంది.
ప్రభుత్వం ప్రకటించిన నగదు బహుమతిని గెలుచుకుంది.ఎంతో మందికి తన విజయం ద్వారా మంచి సందేశాన్ని అందించింది.
ఆ స్పూర్తిదాయక కథనానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన దినోత్సవాన్ని ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తోంది.ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో ప్రజలకు కొన్ని పోటీలు నిర్వహించారు.5 కిలో మీటర్ల పరుగు పందేన్ని చేపట్టారు.అందులో పాల్గొనే మహిళ వయసు 30 ఏళ్లు దాటి ఉండాలనే నియమం పెట్టారు.ఇందులో విజేతలకు బహుమతిగా రూ.లక్ష ఇస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమానికి అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఇక ఈ పరుగు పోటీలో పాల్గొంటే రూ.లక్ష బహుమతి అనే ప్రకటన ఎంతో మంది సామాన్య మహిళల్లో ఆసక్తిని రేకెత్తింది.ఇందులో పాల్గొనేందుకు రమ అనే 35 సంవత్సరాల మహిళ కూడా వచ్చింది.అయితే పరుగు పందేలలో పాల్గొన్న అనుభవం ఆమెకు ఏ మాత్రం లేదు.ఇతరులంతా కాళ్లకు చెప్పులతోనూ, షూలతోనూ పాల్గొనేందుకు వచ్చారు.రమ మాత్రం కనీసం కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేదు.
ఇంకా కేవలం ఒక రోజు ముందు మాత్రమే పరుగు పందెం పట్ల సన్నద్ధమైంది.పరుగు పందెలో పాల్గొని 5 కిలోమీటర్ల దూరాన్ని ఉత్త కాళ్లతోనే పూర్తి చేసింది.
విజేతగా నిలిచి రూ.లక్ష నగదు బహుమతి అందుకుంది.తాను వ్యవసాయ పనుల్లో నిత్యం నిమగ్నమై ఉంటానని చెప్పింది.చెప్పుల్లేకుండానే పరుగెత్తి, రూ.లక్ష నగదు బహుమతి పొందడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.ఆమె విజయగాథ ఎంతో మందికి స్పూర్తినిస్తోంది.