అనారోగ్యం కారణంగా కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వారు, కేవలం వీర్ చైర్ లకు మాత్రమే పరిమితమైన దివ్యాంగులు, స్ట్రెచర్ మీద ఉన్న రోగులను నేరుగా విమానాల్లోకి ఎక్కించేందుకు వీలుగా అవసరమైన యాంబులిఫ్ట్ సౌకర్యం గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చింది.దేశంలోని మొత్తం 14 విమానాశ్రయాల్లో ఈ యాంబులిఫ్ట్ సౌకర్యాన్ని విమానాశ్రయాల ప్రాధికార సంస్థ-ఏఏఐ అందుబాటులోకి తెచ్చింది.
సుగమ్య భారత్ అభియాన్లో భాగంగా అన్ని రకాల ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఈ యంబులిస్ట్ సౌకర్యాన్ని కొనుగోలు చేసింది.
మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ యాంబులిఫ్ట్లను తయారు చేశారు.ఒక్కో యూనిట్కు రూ.63 లక్షలు ఖర్చు చేసి వీటిని కొనుగోలు చేశారు.ఏరోబ్రిడ్జి అందుబాటులో లేని విమానాలకు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తారు.వెలుతురుతో పాటు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను కూడా దీనికి అమర్చారు.ఈ ఒక్కో లిఫ్ట్లో 6 చక్రాల కుర్చీలు, 2 స్ట్రెచర్లను ఒకేసారి ఉపయోగించవచ్చు.ఇక తక్కువ ఛార్జీలతో యాంబులిఫ్ట్ సౌకర్యాన్ని ఏఏఐ అందుబాటులో తెచ్చింది.
దీని ద్వారా కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వారికి, వృద్దులకు చాలా ఉపయోగం కలగనుంది.ఇవి చూడడానికి చిన్నపాటి ఇల్లు వలే కనిపిస్తాయి.
లారీలపై వీటిని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ఝార్సుగూడ, హుబ్బళ్లి, రాజ్కోట్, గోరఖ్పుర్, పట్నా, బాగ్డోగ్రా, విజయవాడ, దేహ్రాదూన్, దర్భంగా, ఇంఫాల్, పోర్ట్బ్లెయిర్, జోధుపుర్, బెళగావి, సిల్చార్, లాంటి మొత్తం 14 విమానాశ్రయాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.మరో 6 ఎయిర్పోర్టుల్లో త్వరలో ఈ యాంబులిఫ్ట్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది.దిమాపుర్, జోర్హాట్, లేహ్, జామ్నగర్, భుజ్, కాన్పుర్ విమానాశ్రయాల్లో యాంబులిఫ్ట్ను ఏర్పాటు చేయనున్నారు.