రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి.వలస పాలన నుంచి భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ప్రధాన కారణం జాతిపిత మహాత్మాగాంధీ.
ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ… తర్వాతి రోజుల్లో మహాత్ముడిగా మారిన తీరు అమోఘం, అనన్య సామాన్యం.సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతోనే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టారు బాపూజీ.ఒక్క భారతావనికే కాకుండా ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి గాంధీ.తరాలు….యుగాలు గడిచినా జాతిపిత మహాత్మాగాంధీ జీవనం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.గాంధీ అహింస సిద్ధాంతం కాలాతీతం… దానికి మరణం లేదు.గాంధీ మహాత్ముడికి భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు.ఎన్నో దేశాల్లో వీధి వీధినా ఆయన విగ్రహాలు వున్నాయి.
శాంతికే ప్రతిరూపమైన బాపూజీ మార్గాన్ని నాటి నుంచి నేటి వరకు ఎందరో దేశాధినేతలు అనుసరించారు.
కాగా.
దీపావళి నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం మహాత్ముడికి ఘన నివాళి అర్పించింది. ఆయన స్మారకార్ధం 5 పౌండ్ల నాణెన్ని బ్రిటన్ ఆర్థిక మంత్రి , భారత సంతతికి చెందిన రిషి సునక్ గురువారం ఆవిష్కరించారు.
హీనా గ్లోవర్ అందించిన డిజైన్ల మేరకు రూపొందించిన ఈ స్మారక నాణెంలో భారత జాతీయ పుష్పం కమలం పువ్వుతోపాటు గాంధీ సూక్తుల్లో ఒకటైన ‘మై లైఫ్ ఇజ్ మై మెసేజ్’ను పొందుపరిచారు.బంగారం, వెండితోపాటు ఇతర మెటల్స్లోనూ గాంధీ స్మారణ నాణెం అందుబాటులో వుండనుంది.
గురువారం నుంచి బ్రిటన్ రాయల్ మింట్ వెబ్సైట్లో వీటిని అమ్మకానికి పెట్టారు.
‘దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నాణెన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉందన్నారు రిషి సునక్.
భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ కీలకపాత్ర పోషించారని… ఈ క్రమంలో మహాత్ముడి స్మారకార్ధం తొలిసారిగా బ్రిటన్ నాణెం రూపొందించడం సంతోషంగా వుందని రిషి సునక్ వ్యాఖ్యానించారు.ఈ స్మారక నాణెం భారత్- యూకేల మధ్య శాశ్వత సంబంధాలు, సాంస్కృతిక వారధికి ప్రతీకగా నిలుస్తుందని ఆర్ధిక మంత్రి ఆకాంక్షించారు.

కాగా.ఇప్పటికే దీపావళిని పురస్కరించుకుని రాయల్ మింట్ మహాలక్ష్మీ గోల్డ్ బార్స్ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 29 నుంచి వీటిని అమ్మకానికి వుంచింది.కార్డిఫ్లోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ ఆలయం సహకారంతో రాయల్ మింట్ డిజైనర్ ఎమ్మా నోబుల్ ఈ గోల్డ్ బిస్కెట్ను డిజైన్ చేశారు.
సాంస్కృతిక వైవిధ్యానికి పట్టం కట్టే ఉద్దేశంతో సంప్రదాయానికి భంగం కలగని రీతిలో దీనిని తయారు చేసినట్టు రాయల్ మింట్ తెలిపింది.