యాదాద్రి భువనగిరి జిల్లా: రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చేందుకు బిజెపి కుట్రలు చేస్తుందన్నారు.డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన సెక్యులర్ పదం వలన మనమందరం కలిసి మెలిసి ఉంటున్నామని,కానీ, బీజేపీ ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నిస్తుందన్నారు.
2000 సంవత్సరంలో ప్రయత్నించారని కానీ, ప్రజలు మేలుకొని 2004లో కాంగ్రెస్ కు ఓటు వేయడం ద్వారా అది సాధ్యం కాలేదన్నారు.తిరిగి ఇప్పుడు 400 సీట్లు గెలిపించాలని మోడీ కోరుతున్నారని,అదే జరిగితే రష్యా,చైనా తరహాలో శాశ్వత ఆధిపత్యం చెలాయించేందుకు మోడీ రాజ్యాంగాన్ని మార్చివేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.పొరపాటున ఈసారి బిజెపి అధికారంలోకి వస్తే దేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని,ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
తన జీవితం తెల్ల కాగితం లాంటిదని,రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేశారని ప్రత్యర్ధులు నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని,మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.