గతంతో పోలిస్తే జనసేన రాజకీయంగా స్పీడ్ పెంచింది.2024 ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేస్తూ ఉండడంతో, స్పీడ్ పెంచేందుకు నిర్ణయించింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీగా ఉండడంతో, జనసేన రాజకీయ వ్యవహారాలన్నీ, ఆ పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు పవన్ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, జనసేన లో ఊపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే మొదటి నుంచి చూస్తే జనసేన లో చేరికలు అంతంతమాత్రంగానే ఉంటూ వచ్చాయి.ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు చేరతారని అనుకున్నా, పవన్ అభిమానులు, ఇతర పార్టీలో సరైన ప్రాధాన్యం లేక వేరే పార్టీలో చేరలేని వారు కొంత మంది వచ్చారు.
అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చేరికలు ఉంటాయని భావించినా, ఆ దిశగా అవకాశాలు కనిపించకపోవడం జనసేనలో నిరాస కలిగిస్తూ వస్తోంది.అయితే టిడిపి జనసేన పొత్తు పెట్టుకోక తప్పదు అని ప్రచారం ఊపందుకున్న దగ్గర నుంచి జనసేన లోను జోష్ పెరిగింది.
టిడిపి జనసేన పొత్తు ఖాయం అయితే, జనసేన కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు టిడిపి సిద్ధంగా ఉన్నట్లుగా సంకేతాలు పంపిస్తోంది. దీంతో జనసేన పార్టీలో చేరాలని చాలా మంది టిడిపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారట.
ఈ మేరకు జన సేన పార్టీ ఆవిర్భావ సభలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.తమకు టికెట్ దక్కే అవకాశం లేదు అనుకునే వారు ఎక్కువ మంది ఇప్పుడు జనసేన లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై జనాల్లో కాస్త వ్యతిరేకత పెరగడం, టిడిపి పైన ప్రజల్లో అంత సానుకూల అభిప్రాయం లేకపోవడంతో, జనసేనకు రాబోయే ఎన్నికల్లో అవకాశం ఉంటుందని, ఒకవేళ టిడిపి జనసేన కాంబినేషన్ కనుక కుదిరితే తప్పకుండా ఏపీలో అధికారంలోకి ఎక్కువ మంది నాయకులు నమ్ముతున్నారు.టిడిపి, జనసేన పొత్తు కుదిరిని తర్వాత పార్టీ లో చేరితే పెద్దగా ప్రాధాన్యం ఉండదని, అందుకే ముందుగానే చేరి, రాజకీయ జీవితానికి ఇబ్బందిలేకుండా చేసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.