ఏపీలో అధికార టీడీపీలో క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పేసింది.ఒకప్పుడు టీడీపీ అంటే క్రమశిక్షణకు ఎంతో మారుపేరు.2014 ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు సీఎం అయ్యాక ఇక్కడ క్రమశిక్షణ అనే పదం కరువైంది.ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అధినేత ఆదేశాలను ధిక్కరిస్తున్నారు.
ఏపీలో 13 జిల్లాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది.పార్టీలోకి వైసీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం, వారికి మంత్రి పదవులు ఇవ్వడంతో ఈ అసంతృప్తి జ్వాలా కుంపటి ఒక్కసారిగా అంటుకుంది.
పాత, కొత్త నాయకుల మధ్య అస్సలు పొసగడం లేదు.ఇక మధ్యలో వచ్చిన వారి నాయకత్వం తాము అంగీకరించబోమని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే చెబుతున్నారు.
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటేస్తామని బాబు చెపుతున్నా ఆయన మాటలు అస్సలు లెక్క చేయడం లేదు.శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత గౌతు శ్యాంసుందర్ శివాజీ, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడిది తలోదారి.
విజయనగరంలో కేంద్ర మంత్రి అశోక్కు జిల్లా ఎమ్మెల్యేలకు పొసగడం లేదు.
ఇక విశాఖలో మంత్రులు అయ్యన్న, గంటా వార్ తెలిసిందే.
తూర్పు గోదావరి జిల్లాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కన్పించడమే మానేశారు.అక్కడ యనమలకు జ్యోతులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
పశ్చిమలో మాజీ మంత్రి పీతలకు ఏలూరు ఎంపీ మాగంటికి పడదు.ఇక రాజమండ్రి ఎంపీ మురళీమోహన్కు జడ్పీ చైర్మన్ బాపిరాజుకు కూడా గ్యాప్ వచ్చింది.
కృష్ణాలో ఎంపీ కేశినేనినికి, మంత్రి ఉమాకు పడదు.ఇక ఉమాకు బుద్ధ ప్రసాద్, కాగిత వెంకట్రావుతో పాటు మరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో సైతం పొసగని పరిస్థితి.
గుంటూరులో స్పీకర్ కోడెలకు కొందరు ఎమ్మెల్యేలకు పడట్లేదు.ప్రకాశంలో గొట్టిపాటి వర్సెస్ కరణం వార్ ఆగేలా లేదు.
ఇక సీమలో కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో అక్కడా ఇన్నేళ్లూ జెండా మోసిన కార్యకర్త దూరమవుతున్నారు.రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ రావడంతో ఈ వార్ సుఖాంతమవుతుందేమో చూడాలి.
చిత్తూరు జిల్లాలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి ముద్దు కృష్ణమ నాయుడు, ఎంపీ శివప్రసాద్ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు.అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, జేసీ దివాకర్ రెడ్డి, వరదాపురం సూరిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది.
ఇలా ఏపీలో అన్ని జిల్లాలోను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండు వర్గాలుగా విడిపోయి డిష్యుం.డిష్యుంలాడుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి అయినా ఈ వర్గపోరుకు బాబు చెక్ పెట్టకపోతే పార్టీ చాలా నియోజకవర్గాల్లో నష్టపోవడం ఖాయం.