ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది.కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చే విధంగా ఏం చేయాలనే విషయంపై గత కొద్ది రోజులుగా విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ సందర్భంగా బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీకి ఊపు తీసుకువచ్చే విధంగా ఏం చేయాలని విషయంపైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది.దీనిలో భాగంగానే ఏపీలో కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు రావాలనే విషయంపై దృష్టి సారించింది.ఆంధ్ర – తెలంగాణ విభజన తర్వాత ఏపీ లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా దెబ్బతింది.
2014 ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం, క్యాడర్ చెల్లాచెదురు కావడం, నాయకత్వ లోపం వంటి అన్ని విషయాల పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది.ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం ఈ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి కి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సాకే శైలజానాథ్ యాక్టివ్ గా లేకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవడం వంటి కారణాలతో ఆయనను తప్పించి కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కిరణ్ కుమార్ రెడ్డికి ఉండడం, విస్తృతమైన పరిచయాలు వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుని ఆయన పేరు ను అధిష్టానం ఫైనల్ చేయాలని చూస్తోందట.ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన లో ఉన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ కీలక నేతలు అందరినీ ఆయన కలుస్తూ ఉండడంతో అతి తొందర్లోనే ఆయనను పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.ఏపీలో రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా జగన్ వైపు ఉండడంతో ఆ సామాజిక వర్గం లో చీలిక తెచ్చేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ని ఎంపిక చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.