ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది యాకూబ్ మెమన్కు ఉరి శిక్ష అమలు చేసే రోజు దగ్గర పడుతోంది.తనకు ఉరి శిక్ష అమలు చేయొద్దని, దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చాలని దోషి అయిన యాకూబ్ మెమన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
ఆయన భార్య కూడా అదే కోరింది.మరణ శిక్ష ఉండకూడదని అభిప్రాయపడుతున్న కొందరు మేధావులు, ప్రముఖులు కూడా అతని ఉరి శిక్షను రద్దు చేసి, యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతున్నారు.
మరో పక్క ఉరి శిక్ష అమలుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.ముంబయి ఉగ్రదాడిలో పట్టుబడి దోషిగా తేలిన అజ్మల్ కసబ్ను ఉరితీసిన తలారీయే ఇప్పుడు యాకూబ్ మెమన్ను ఉరి తీసే అవకాశం ఉంది.
ఈ తలారీ ఎరవాడ సెంట్రల్ జైలు నుంచి యాకూబ్ను ఉరి తీసే నాగ్పూర్ జైలుకు రెండు రోజుల క్రితం చేరుకున్నాడు.భద్రతా కారణాల రీత్యా యాకూబ్ను ఉరి తీసే వ్యక్తి వివరాలు జైలు అధికారులు గోప్యంగా ఉంచారు.
యాకూబ్ను ఉరి తీసేందుకు నాగపూర్ జైల్లో ప్రత్యేకంగా ఉరికంబం నిర్మిస్తున్నారు.ఆ పనులు చూడటం కోసం ముగ్గురు కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా నియమించారు.
ఈ నెల (జూలై) ముప్పయ్యో తేదీన యాకూబ్ను ఉరి తీయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.అతని ఉరి శిక్షను రద్దు చేయాలని అనేక విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మారుతుందా? చెప్పలేం.మారకపోతే మరో ఉగ్రవాది ఉరిశిక్ష చరిత్రలో నమోదవుతుంది.