సీబీఐ విషయంలో ఇటీవల మహారాష్ట్ర సర్కార్ అయితే ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుందో అలాంటి కీలక నిర్ణయమే జార్ఖండ్ రాష్ట్రం తీసుకుంది.తమ రాష్ట్రంలో సీబీఐకి ఉన్న సాధారణ సమ్మతిని నిరాకరిస్తున్న రాష్ట్రాల జాబితా క్రమక్రమంగా పెరుగుతోంది.తాజాగా బీజేపీయేతర రాష్ట్రమైన జార్ఖండ్ సైతం ఇదే రకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.2018లో పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు(చంద్రబాబు హయాంలో) సీబీఐకి సమ్మతిని వెనక్కి తీసుకున్నాయి.అయితే 2019లో ఏపీ ప్రభుత్వం(జగన్ సర్కార్)ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది.మరోవైపు 2019 జనవరిలో ఛత్తీస్గఢ్, 2020 జూలైలో రాజస్థాన్, గత నెలలోనే మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి సమ్మతిని వెనక్కి తీసుకోగా ఇప్పుడు తాజాగా కేరళ, జార్ఖండ్ లు కూడా ఈ రాష్ట్రాల సరసన చేరాయి.
రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా సీబీఐ ఎలాంటి కేసులు విచారించకూడదు అంటూ ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది.దీనితో సీబీఐకి తమ రాష్ట్రంలోకి నో ఎంట్రీ అనేసిన ఏడో రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది.
తమ ప్రభుత్వాలను, పార్టీని ఇబ్బంది పెట్టేందుకు సీబీఐను కేంద్రం పావుగా వాడుకుంటోందని ఆరోపిస్తూ బీజేపీయేతర రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ ప్రభుత్వాలు గతంలో ఈ రకమైన తీర్మానాలు చేశాయి.
అయితే ప్రస్తుతం దాఖలైన కేసులపై మాత్రం ఈ తీర్మానం ప్రభావితం చేయదు కానీ, కొత్త కేసుల్లో మాత్రం సీబీఐ విచారణ చేపట్టడాన్ని మాత్రం ఈ కొత్త చట్టం నిషేధిస్తుంది.
అయితే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలైన అవినీతి కేసుల్లో దాడులు చేపట్టకపోతే.సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని సీబీఐ వాదిస్తోంది.మరి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడుతున్న ఈ సీబీఐ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.