ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ భారత్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా యూనివర్సిటీల్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
వివాదాస్పదమైన ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను మనదేశంలో కేంద్రం నిషేధించింది.అయినప్పటికీ కొన్ని చోట్ల బహిరంగంగా దీనిని ప్రదర్శిస్తూ వుండటం ఉద్రిక్తతలకు కారణమవుతోంది.
ఇదిలావుండగా.మోడీ డాక్యుమెంటరీ సెగ విదేశాలను తాకుతోంది.
దీనికి వ్యతిరేకంగా పలువురు ప్రవాస భారతీయులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
తాజాగా అమెరికాలోనూ ఎన్ఆర్ఐలు భగ్గుమన్నారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఫ్రీమాంట్లో ఇండియన్ కమ్యూనిటీ గత శనివారం బీబీసీ డాక్యుమెంటరీపై ఆందోళన నిర్వహించింది.ఫ్లకార్డులు పట్టుకుని బీబీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పక్షపాతంతో ,జాత్యహంకారంతో రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు.బీబీసీ డాక్యుమెంటరీ నకిలీ ప్రచారాన్ని నిర్వహిస్తోందని.
బీబీసీ ఒక ఫేక్ న్యూస్ అంటూ ప్రవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ “India: The Modi Question” పేరుతో డాక్యుమెంటరీని రూపొందించి దానిని రెండు భాగాలుగా ప్రసారం చేసింది.అయితే జనవరి 19న ఈ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం ఖండించింది.యూకే అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ .వలసవాద మనస్తత్వాన్ని తెలియజేస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు.ఈ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక ఉద్దేశం, దాని వెనుక వున్న అజెండా ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఇకపోతే.మోడీ డాక్యుమెంటరీపై యూకేలోని భారతీయ కమ్యూనిటీ సైతం భగ్గుమంది.గడిచిన కొన్ని రోజులుగా లండన్లోని ప్రవాస భారతీయులు బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు.ఆదివారం కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.ప్రధాని మోడీకి తక్షణం బీబీసీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.