అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.తెలుగు ఎన్ఆర్ఐ ఒకరు ప్రమాదవశాత్తు రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామానికి చెందిన రాజమౌళి చిన్న కుమారుడు ప్రవీణ్ కుమార్ (37) భార్య నవతతో కలిసి అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడ్డారు.
ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, వీరికి మూడేళ్ల బాబు కూడా వున్నాడు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 22న ప్రవీణ్ కుమార్ న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్షిప్ నుంచి న్యూయార్క్లోని ఆఫీసుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తూ రైలు కింద పడి చనిపోయాడు.
ప్రవీణ్ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.ఇదే విషాదం అనుకుంటే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా అన్ని రకాల అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి.దీంతో ప్రవీణ్ మృతదేహం ఆసుపత్రిలోనే ఉండిపోయింది.తమకు చివరి చూపు కలిగించండంటూ ప్రవీణ్ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అచ్చం ఇదే రకమైన పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు హైదరాబాద్కు చెందిన పానుగంటి శ్రీధర్ తల్లిదండ్రులు.శ్రీధర్ అమెరికాలో ఆరేళ్లుగా టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు.న్యూయార్క్ సిటీలోని బాఫెల్లాలో నివాసముండే అతడికి భార్య ఝాన్సీ, కుమారుడు శ్రీజన్(5) ఉన్నారు.ఈ ఏడాది మార్చిలో సోదరుడి వివాహం నిమిత్తం భార్య ఝాన్సీ, శ్రీజన్ ఇండియాకు వచ్చారు.

అయితే ఆ సమయంలో భారత ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ఇక్కడే ఉండిపోయారు.నాటి నుంచి శ్రీధర్ అమెరికాలో ఒంటరిగానే ఉంటున్నాడు.భార్యాపిల్లల యోగక్షేమాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు.అయితే నవంబర్ 27న ఉదయం శ్రీధర్ భార్య ఝాన్సీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని నుంచి సమాధానం రాలేదు.ప్రతిరోజూ ఎన్ని పనులున్నా.తన ఫోన్ను లిఫ్ట్ చేయకుండా వుండని భర్త నుంచి స్పందన రాకపోవడంతో ఝాన్సీ ఆందోళనకు గురైంది.

వెంటనే అమెరికాలో తాము నివసిస్తున్న అపార్ట్మెంట్లో తెలిసిన వారికి ఫోన్ చేసింది.దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లోపలికి వెళ్లి చూడగా శ్రీధర్ నిర్జీవంగా కనిపించాడు.ఈ విషయం తెలుసుకున్న భార్య ఝాన్సీ ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసుకుని శ్రీధర్ మృతదేహం భారతదేశానికి రావాలంటే కనీసం ఆరు నెలలైనా పడుతుందని అధికారులు చెప్పడతో ఆయన కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం.