సొంత పార్టీ పెడతాడా ? బీజేపీలో చేరతారా ? అసలు ఏ రాజకీయ నిర్ణయం తీసుకుంటాడు ? ఇలా అనేక అంశాలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు పై అందరికీ అనేక సందేహాలు నెలకొన్నాయి.ఆయన ఫలానా పార్టీలో చేరబోతున్నాడు, లేదు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా సొంత పార్టీ పెట్టబోతున్నాడు ఇలా రకరకాల ఊహాగానాలు ఎన్నో ఈటల రాజేందర్ వ్యవహారంలో బయటకు వస్తున్నాయి.
అయినా ఆయన మాత్రం నోరు మెదపడం లేదు.సైలెంట్ గా నే వ్యూహాలు అమలు చేసుకుంటూ వెళుతున్నారు.
తెలంగాణ అంతటా తిరుగుతూ, అన్ని పార్టీల నాయకులను కలుస్తూ, భవిష్యత్తుపై వారి సలహాలు తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే త్వరలోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు.
అయితే ఈ పరిణామాలన్నింటినీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్న టిఆర్ఎస్ పార్టీ ఈటెల పై అనర్హత వేటు అస్త్రాన్ని బయటకు తీస్తోంది.
ఈటెలపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ ను కోరుతాము అంటూ హడావుడి చేస్తోంది.
అసలు ఉప ఎన్నికలకు వెళ్లేందుకు టిఆర్ఎస్ పార్టీ ఏ మాత్రం సిద్ధంగా లేదు.అనవసరంగా ఎన్నికలకు వెళ్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆ పార్టీకి బాగా తెలుసు.
దీనికితోడు హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటెలకు గట్టిపట్టు ఉండడం, టిఆర్ఎస్ కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడంతో పాటు, ఉప ఎన్నికలు అంటూ వస్తే కాంగ్రెస్ బీజేపీతో పాటు తెలంగాణ ఉద్యమకారులు రాజేందర్ కు మద్దతుగా నిలబడతారని టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు అంతా ఒకటవుతారని టిఆర్ఎస్ అభిప్రాయపడుతోంది.అయితే టిఆర్ఎస్ భావిస్తున్నట్లుగా అనర్హత వేటు వేయించడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు.
న్యాయపరమైన ఇబ్బందులు ఎన్నో ఉంటాయి.అయినా అనర్హత వేటు అంటూ టీఆర్ఎస్ పదే పదే భయపెట్టే ప్రయత్నం చేస్తోంది.

అసలు అనర్హత వేటు ఈటలపై వేయడం సాధ్యమవుతుందా అనే ఈ విషయం పైనా టిఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది.ఒకపక్క ఎన్నికలకు వెళ్లేందుకు టిఆర్ఎస్ భయపడుతూనే తాము ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈటెల ఖచ్చితంగా ఓటమి చెందుతారు అనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఈటెల వైపు టీఆర్ఎస్ క్యాడర్ వెళ్లకుండా హుజురాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ చక్రం తిప్పుతోంది.