మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని లక్ష్యం తో తెలంగాణ బిజెపి నాయకులు ఉన్నారు.దీనికి తగ్గట్లు గానే కేంద్ర బీజేపీ పెద్దలు సైతం అనేక విధాలుగా ప్రోత్సాహం అందిస్తూ , గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రులు పర్యటనలు చేస్తున్నారు.
త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రాబోతున్నారు.ఈ విధంగా తెలంగాణలో బిజెపికి హైప్ సృష్టించి టిఆర్ఎస్, కాంగ్రెస్ కు దీటుగా బలోపేతమై మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని, తద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి జెండా రెపరెపలాడించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
దీనికి అనుగుణంగానే ఎప్పటికప్పుడు పార్టీ కీలక నాయకులంతా సమావేశం అవుతూ, ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించాలనే విషయంపై చర్చ జరుపుతున్నారు.తాజాగా నిన్న జరిగిన కోర్ కమిటీ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం ను ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు.దీనిలో భాగంగానే బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో 15వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి అసెంబ్లీ ఎదురుగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
అలాగే 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆ రోజు నుంచి వచ్చే నెల రెండవ తేదీ మహాత్మా గాంధీ జయంతి వరకు పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయించుకున్నారు.అలాగే 16 లోక్ సభ నియోజకవర్గాలకు నియమించిన కన్వీనర్లు , జాయింట్ కన్వీనర్లు, జిల్లా పార్టీ ఇన్చార్జీలతో బుధవారం బండి సంజయ్ ఇతర ముఖ్య నేతలు భేటీ కావాలని, మునుగోడులో గెలిచేందుకు ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించాలని నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.మొత్తంగా తెలంగాణ బిజెపి నాయకులు కేంద్ర బిజెపి పెద్దలు ఇలా అంతా ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపు పైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.