కరోనా మహమ్మారి విజృంభణ , ఆ తర్వాత లాక్ డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు నేటికీ ప్రారంభం కాలేదు.ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైనప్పటికీ , బస్సు సర్వీసుల విషయంలో ఒప్పందాలను పునర్ సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుండటంతో ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ రాలేదు.
ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ తిరుగుతున్నాయి.
అయితే , ఈ అంశంపై ఏపీ , తెలంగాణకి సంబంధించిన అధికారులు పలుసార్లు సమావేశమైనప్పటికీ, ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు.
తాజాగా నేడు మరోసారి హైదరాబాద్ బస్ భవన్లో ఇరు రాష్టాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం కానుండటంతో.ఈ సమావేశంలో అయినా దీనిపై ఏకాభిప్రాయం కుదురుతుందేమో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ అంశంపై ఏకాభిప్రాయం రాకపోయినా , కనీసం దసరా పండగ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై తాత్కాలిక ఒప్పందం చేసుకోవడానికి ఇరు రాష్ట్రాలు భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రోజుకు 1.60 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతామని, ఏపీఎస్ఆర్టీసీ కూడా అన్ని కిలోమీటర్లకే పరిమితం కావాలని తెలంగాణ అధికారులు సూచిస్తున్నారు.కానీ అందుకు ఏపీ అధికారులు అంగీకరించడం లేదు.
దీనితో పలుమార్లు భేటీలు జరుగుతున్నా ఈ సమస్య తీరడం లేదు.