సచివాలయం సాక్షిగా కొన్ని మార్పులు జరగనున్నాయి.ఆ మార్పులు గురించి తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే…మున్ముందు.
సచివాలయంలోకి మీడియాను అనుమతించకూడదని ప్రభుత్వం యోచిస్తోంది.అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీడియాను సచివాలయంలోకి అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం ఇదే విధానాన్ని అవలంబిస్తోంది.ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉండటం విశేషం.
ఈ అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.మీడియాను అనుమతించకూడదన్న ప్రతిపాదన అధికారుల నుంచి రాగా, ఈ అంశం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా సానుకూలంగా ఉండటంతో త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
సచివాలయానికి ప్రతి నిత్యం సుమారు రెండు వందలమంది మీడియా ప్రతినిధులు రాకపోకలు సాగిస్తూ ఉండటం వల్ల తమ విధులకు ఆటంకం కలుగుతోందని కొందరు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, వారి అభిప్రాయంతో సిఎం ఏకీభవించినట్టు తెలిసింది.ప్రస్తుతం మీడియాను ఏయే రాష్ట్రాల్లో అనుమతించడం లేదో ముఖ్యమంత్రి ఆరా తీయగా తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లలో అమలు చేస్తున్నట్టు అధికారులు వివరించారు.
ఇటీవల ఢిల్లీ సచివాలయంలోకి మీడియాను అనుమతించని విషయం కూడా చర్చకు వచ్చింది.అయితే మీడియాను పూర్తిగా బహిష్కరించకుండా మింట్ కంపౌండ్ వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేసి, అవసరం అయినప్పుడు అక్కడికే మంత్రులు, అధికారులు వెళ్లి మాట్లాడే విధంగా ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది.
మరి దీనిపై మీడియా వర్గాలు ఏమంటాయో చూడాలి.