ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ.ఆ ప్రాంత రైతులు, మహిళలు, ప్రజాసంఘాలు మహా పాదయాత్ర పేరుతో అమరావతి నుంచి అరసవల్లి వరకు యాత్రను చేపడుతున్నాయి.
ఇప్పటికే ఈ యాత్ర కృష్ణ , ఏలూరు జిల్లాల మీదుగా పశ్చిమగోదావరిలో కొనసాగుతోంది.తూర్పుగోదావరి జిల్లా తర్వాత విశాఖ జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుంది.
అంటే ఉత్తరాంధ్రలోకి ఈ యాత్ర ప్రవేశిస్తుంది.ఇప్పటి వరకు జరిగిన పాదయాత్ర ఒక ఎత్తు అయితే, ఉత్తరాంధ్రలో జరగబోయే యాత్ర మరో ఎత్తు కాబోతోంది.
ఇప్పటివరకు ప్రశాంతంగానే ఈ యాత్ర సాగినా, ఉత్తరాంధ్రలో మాత్రం ఉద్రిక్తతలు తప్పేలా కనిపించడం లేదు.ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన వైసిపి మంత్రులు , ఎమ్మెల్యేలు వికేంద్రీకరణకు అనుకూలంగా రాజీనామాలకు సిద్ధమయ్యారు .రెండు రోజుల క్రితమే ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జగన్ అనుమతిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. ఇక నిన్న విశాఖ జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ , మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తమ ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా ఆ లేఖలను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ కు అందజేశారు .వాటిని స్పీకర్ కు పంపాలని వారు సూచించారు.వీరే కాకుండా మరి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.రాజకీయ పార్టీలకు అతీతంగా వికేంద్రీకరణ కు అనుకూలంగా జేఏసీ ఇప్పటికే ఏర్పాటయింది.
ఈనెల 15వ తేదీన విశాఖలో వీకేంద్రీకరణకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
అలాగే త్వరలో మండల, గ్రామస్థాయిలో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.అమరావతి మహాపాదయాత్ర ఉత్తరాంధ్రలోకి ప్రవేశించక ముందే వీకేంద్రకరణకు అనుకూలంగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖకు దశాబ్దాల తర్వాత రాజధాని వస్తుంటే… దానిని టిడిపి అడ్డుకుంటుంది అనే విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి . అమరావతి రైతుల మహా పాదయాత్ర గతంలో న్యాయస్థానంటూ దేవస్థానం ప్రశాంతంగానే జరిగింది .గుంటూరు, ప్రకాశం ,నెల్లూరు జిల్లాల మీదుగా తిరుపతి వరకు చేరుకుంది .ఈ యాత్రలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడలేదు.అయితే ఇప్పుడు అమరావతి టు అరసవల్లి పాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశించగానే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ విషయంలో వైసిపి ఎమ్మెల్యేలు , మంత్రులు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ టిడిపిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.అంతేకాదు వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఒత్తిడిని పరోక్షంగా పెంచుతున్నారు.