పనామా, హోండూరస్, చిలీలలో తన పర్యటన దక్షిణ అమెరికా దేశాలతో భారత్ సంబంధాలకు కొత్త ఊపును అందించిందన్నారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖీ .ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు దక్షిణ అమెరికా దేశాలలో లేఖీ పర్యటించారు.
దీనికి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.ఏప్రిల్ 28 నుంచి మే 1 వరకు జరిగిన పనామా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి ఎరికా మౌయిన్స్తో మీనాక్షీ సమావేశమై, ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా భారత్- పనామా మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.అలాగే భారత్ – సీఐఎస్ఏ (సెంట్రల్ అమెరికన్ ఇంటిగ్రేషన్ సిస్టమ్) ఫ్రేమ్ వర్క్ ద్వారా మరింత సహకారానికి అంగీకరించినట్లు ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కెనాల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అరిస్టైడ్స్ రోయోతో కలిసి పనామా కెనాల్ను సందర్శించారు లేఖీ.అలాగే దక్షిణ అమెరికాలోనే అతిపెద్ద ఎఫ్టీజెడ్ కోలన్ ఫ్రీ ట్రేడ్ జోన్ను కూడా సందర్శించారు.
ఇదే సమయంలో పనామాలో స్థిరపడిన భారత సంతతి పారిశ్రామిక వేత్తలతో మీనాక్షీ సమావేశమయ్యారు.ఐకానిక్ సింటా కోస్టెరాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 కోసం కర్టెన్ రైజర్కు నాయకత్వం వహించిన ఆమె.పనామాలోని హిందూ దేవాలయాన్ని సందర్శించి, అశోక వృక్షాన్ని నాటారు.లాటిన్ అమెరికాలోనే అతిపెద్దదైన భారతీయ కమ్యూనిటీతోనూ ఆమె భేటీ అయ్యారు.
ఇక మే 1 నుంచి 3 వరకు మీనాక్షీ లేఖీ హోండూరస్లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ఐరిస్ జియోమారా క్యాస్ట్రో సర్మింటోతో ఆమె సమావేశమయ్యారు.
అలాగే హోండూరస్ విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రిని కూడా కలుసుకుని వివిధ సమస్యలపై చర్చించారు.హోండూరస్ వ్యవసాయ శాఖ మంత్రి లారా సువాజోతో కలిసి 26.5 మిలియన్ డాలర్ల విలువ చేసే వ్యాలీ ఇరిగేషన్ ప్రాజెక్ట్కు మీనాక్షీ శంకుస్థాపన చేశారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా 3,060 హెక్టార్లకు సాగునీరు అందుతుందని అంచనా.

ఇక చివరిగా.మే 3 నుంచి 5 వరకు చిలీలో పర్యటించారు మీనాక్షీ లేఖీ.ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనియా ఉర్రెజోలా నోగురాతో పలు చర్చలు జరిపారు.ఫార్మా, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధనం, వికలాంగుల సాధికారతపై కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
చిలీ పరిశ్రమల సమాఖ్య (ఎస్వోఎఫ్వోఎఫ్ఏ)తో జరిగిన సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులలో ద్వైపాక్షిక సహకారం, చిలీ కంపెనీలకు భారత్లో అవకాశాలపై మీనాక్షీ లేఖీ చర్చించారు.అలాగే చిలీలో స్థిరపడిన భారతీయ కమ్యూనిటీతో ముచ్చటించిన ఆమె ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఖాదీ, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు.