కరోనా కారణంగా సినిమాల విడుదల విషయంలో ఎంత గందర గోళం నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది వారం ముందు వరకు చెప్పలేక పోతున్నారు.
విడుదల తేదీలు బ్లాక్ చేసుకోవడం, మళ్ళీ వాయిదా వేసుకోవడం, కొత్త డేట్స్ వెతుక్కోవడం అన్నీ బాగున్నాయని అనుకునే లోపు మళ్ళీ పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించడం తో తారుమారు అవుతున్నాయి.కరోనా వచ్చినప్పటి నుండి ఇదే పరిస్థితి నెలకొంది.
రాజమౌళి తన ఆర్ ఆర్ ఆర్ కారణంగా ఇండస్ట్రీలో భారీ సినిమాలు సైతం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.సంక్రాంతి సీజన్ లో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా రాబోతుందని ప్రకటించడంతో మిగతా స్టార్ హీరోలు పక్కకు తప్పుకున్నారు .కానీ కరోనా థర్డ్ వేవ్ కారణంగా మళ్ళీ వాయిదా వేసుకున్నాడు జక్కన్న.
దీంతో ఇప్పుడు మళ్ళీ రిపీట్ సీన్ నెలకొంది.
కరోనా తగ్గడంతో అన్ని సినిమాలు ఫిబ్రవరి మొదలుకుని సమ్మర్ వరకు తమ సినిమాల రిలీజ్ డేట్ లను ప్రకటించారు.అలాంటి సమయంలో జక్కన్న రెండు డేట్స్ వదిలారు.
దీంతో ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియక అయోమయంలో పడ్డారు.కానీ చివరకు ఈ రెండు కాదని మరొక డేట్ పై కర్చీఫ్ వేసాడు రాజమౌళి.
దీంతో చిన్న సినిమాలు ఆర్ ఆర్ ఆర్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు రాజమౌళి మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా తన భీమ్లా నాయక్ సినిమాతో రిలీజ్ డేట్ లను గెలికేసే బాధ్యత తీసుకున్నట్టు ఉంది.భీమ్లా నాయక్ సినిమాకు కూడా రెండు డేట్స్ ప్రకటించారు.అయితే ఫిబ్రవరి 25న కన్ఫర్మ్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు.
అదే రోజు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు, వరుణ్ తేజ్ గని, సెబాస్టియన్ సినిమాలు కూడా రిలీజ్ డేట్లు పెట్టుకున్నారు.
పవన్ వస్తాడో రాడో అనే అనుమానంతో వీరు ఈ డేట్ ను బ్లాక్ చేసుకున్నారు.మొన్నటి వరకు పవన్ కూడా సైలెంట్ గా ఉండడంతో రిలీజ్ కు సన్నాహాలు చేసుకున్నారు.కానీ ఇప్పుడు మళ్ళీ పవన్ వస్తున్నాడని తెలియడంతో పవన్ తో పోటీ పడాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఒకవేళ దైర్యం చేసి వచ్చిన కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం ఉంటుంది.ఇలా మిగతా సినిమాల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే మాదిరిగా తయారయ్యింది.
పవన్ ఒక్క పోస్టర్ తో ఇంత మందిని సందిగ్ధంలో పడేసాడు.